ప్రజాశక్తి -నందిగామ
ఆగస్టు1న చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు వాల్ పోస్టర్ శుక్రవారం రిలీజ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు1న రాష్ట్ర వ్యాప్తంగా ఛలో కలెక్టరేట్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ వెల్లడించారు. ఇందుకు పోస్టరును అక్షర జూనియర్ కళాశాలలో విడుదల చేశారు. విద్యారంగంలోని సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించలేకపోయిందని తెలిపారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 3, 4, 5 తరగతుల విలీనం నిలుపుదల చేయాలని, పెండింగు పాఠ్యపుస్తకాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. జిఓ 117ను రద్దు చేయాలని చేపట్టిన 'బడి కోసం బస్సు యాత్ర' విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ర్థులు, తల్లిదండ్రులను కలుపుకుని ప్రభుత కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాని,రవి, వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు










