ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 20న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని, కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి. భాగ్యలక్ష్మి, రాయచోటి ప్రాజెక్టు అధ్యక్షురాలు సిద్ధమ్మ పేర్కొన్నారు. శనివారం చలో విజయవాడకు సంబంధించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ సుధాకర్కు ముందుస్తు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5 లక్షల వేతనంతో కూడిన సెలవులు, సగం వేతనంతో కూడిన పెన్షన్ , కనీసవేతనం రూ. 26 వేలు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా, సంక్షేమ పథకాల అమలు చేయాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం నివారించాలని, హెల్పర్లకు వయో పరిమితి 50 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తనిఖీల పేరుతో వేధింపులు అరికట్టాలని తదితర డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు విజయమ్మ జయమ్మ, సుమలత, అనిత, స్వప్న పాల్గొన్నారు.










