Jul 28,2022 22:45

ప్రజాశక్తి-విజయవాడ
జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం పనులలో భాగంగా జిల్లాలో భూ సర్వే వేగవంతం చేస్తున్నామని, ఇప్పటికే 7 గ్రామాలలో 13 నోటిఫికేషన్‌ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, కార్యదర్శి బాబు ఏ, సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కమీషనర్‌ సిద్ధార్థ జైన్‌లు ప్రధాన కార్యాలయం నుండి గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిని సిసిఎల్‌కు వివరించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం పనులలో భాగంగా జిల్లాలో 8 మండలాలలో 136 గ్రామాలలో భూ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సర్వేలో చివరి దశ అయిన 13వ నోటిఫికేషన్‌ 7 గ్రామాలలో పూర్తి చేశామన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్‌ మహ్మద్‌ పేట, కంచికచర్ల మండలం పరిటాల, గంపలగూడెం మండలం రాజవరం, చెన్నవరం, ఎ కొండూరు మండలంలోని వామకుంట్ల, మారేపల్లి, విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామాలలో పూర్తి అయిందన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు, జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికాడ్స్‌ ఆఫీసర్‌ కె. సూర్యరావు, ఉన్నారు.