Feb 05,2023 21:28

సమావేశంలో మాట్లాడుతున్న జంగా గౌతమ్‌

మడకశిర రూరల్‌ : దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపికి పోటీ ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే అని రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీని ఓడించే శక్తి కాంగ్రెస్‌ పార్టీకే ఉందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ అన్నారు. మడకశిర పట్టణంలోనికోల్డ్‌ స్టోరేజ్‌ వద్ద ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గౌతమ్‌ మాట్లాడుతూ దేశంలో రాహుల్‌ గాంధీ చేపట్టిన జడో పాదయాత్ర చారిత్రాత్మకమైందని అన్నారు. ఇలాంటి యాత్ర 50 ఏళ్లగా ఎవరు చేయలేదన్నారు. రాహుల్‌ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ రావాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. వైసిపి పాలనలో రాష్ట్ర వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ఇవ్వటం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పిసిసి వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు సుధాకర్‌ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు చెందిన పలువురు పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా గౌతమ్‌ మాట్లాడుతు మతతత్వ బిజెపి అధికారం కోసం ప్రజల మధ్యలో చిచ్చు పెడుతోందని విమర్శించారు. దత్త పుత్రులైన ఆదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అప్పజెబుతోందన్నారు. ఎఐసిసి పిలుపు మేరకు ఆదానీ కంపెనీ అవకతవకలపై, ఎస్‌బిఐ, ఎన్‌ఐసి జాతీయ బ్యాంకుల భద్రత కోసం ధర్నా చేపడుతామన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి మెంబర్‌ కెటి శ్రీధర్‌, నాగరాజు, అమనూల్లా, యునుస్‌, జమీల్‌, రామాంజినేయులు, గంగాధరప్ప, శ్వామ్‌, హరిత, రఫిక్‌, మహాబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.