Apr 01,2023 21:34

ఫొటో : మాట్లాడుతున్న కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాల్‌

గిరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలి
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్‌ మండలం వావిలేటిపాడు కొత్త గిరిజన కాలనీలో నివసిస్తున్న సుమారు 40 గిరిజన కుటుంబాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని కెవిపిఎస్‌ నాయకులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మార్చి 23వ తేదీ ఉగాది పండుగ సందర్భంగా కాలనీకి పక్కనే ఉన్న మహాలక్ష్మమ్మ దేవాలయంలో టెంకాయలు కొట్టి పొంగళ్లు పెట్టుకునేందుకు వెళ్లగా అక్కడున్న పెత్తందారులు వారిపై వివక్ష చూపించి, చల్లా యానాదులకు దేవాలయ ప్రవేశం లేదని అడ్డుకొని వెనక్కి పంపించారని తెలిపారు.
జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌, నెల్లూరు రూరల్‌ తహశీల్దారు, ఎస్‌ఐ స్పందించి గిరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, డివిఎంసి మెంబర్‌ శేషం సుదర్శన, శాంతమ్మ, శ్రీనివాసులు, రమణయ్య, సంజీవమ్మ తదితరులు పాల్గొన్నారు.