- నా మద్దతు విద్య, వైద్యం,ఉపాధికే
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : త్వరలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను ఒక పార్టీకి మద్దతిస్తున్నట్లు దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపిఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. సోమవారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. తన మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుందని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయా పార్టీలు వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలని సూచించారు. విఆర్ఎస్ తీసుకున్న తాను ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని, ఉన్నత ఆశయంతో ముందుకు వెళ్తున్న తనను వివాదాల జోలికి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాల్లోకి లాగితే అంచనాలు తలకిందులవుతాయని రాజకీయ పార్టీలకు సూచించారు. కాగా, ఐపిఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్పి తెలంగాణలో బిఎస్పి బాధ్యతలు తీసుకుంటున్నట్లు స్వేరోస్ నెట్వర్క్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన బిఎస్పి అధినేత్రి మాయావతిని కలవనున్నట్లు తెలిసింది.