
హనుమంత వాహనంపై శ్రీపద్మావతి అమ్మవారు
ప్రజాశక్తి- తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు కటాక్షించారు. అశ్వాలు, వషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, విజివో బాలిరెడ్డి, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
పంచమి తీర్థానికి విస్తత ఏర్పాట్లు : టీటీడీ జేఈవో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజైన నవంబరు 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తతంగా ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులో పంచమితీర్థం ఏర్పాట్లను జేఈవో సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో గేట్లు, పంచమితీర్థ మండపాన్ని, పద్మ సరోవరంను పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు, తిరిగి బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంచమితీర్థానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పటిష్టంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల కోసం అన్నప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు పెద్దసంఖ్యలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి రోడ్డు వద్ద భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న జర్మన్ షెడ్లను జేఈవో అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. జేఈవో వెంట సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ - 3 సత్యనారాయణ, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, వీజివో బాలిరెడ్డి, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, తిరుచానూరు సిఐ శివప్రసాద్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.