ప్రజాశక్తి-హిందూపురం : పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. నెలకు రూ.2500 ఇవ్వాలన్నారు. బుధవారం పట్టణంలోని బిసి కళాశాల వసతిగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు 3, 4 తరగతులకు రూ.1150, 5 నుంచి 10వ తరగతులకు రూ.1400, ఇంటర్ ఆ పై చదువులు విద్యార్థులకు రూ.1600 పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. బయట ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. దానికి అనుగుణంగా మెస్ఛార్జీలు పెంచాలన్నారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్, హర్ష కుమార్, జస్వంత్, బాబా ఫక్రుద్దీన్, వీరేష్, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.










