Nov 09,2023 20:47

గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించ తలపెట్టిన ప్రాంతం

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్భంగా జిల్లాకు పలు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే ఆ హామీలను విస్మరించారు...
టెక్స్‌టైల్‌ పార్కు భూకేటాయింపుకే పరిమితం
ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో బనవాసి కేంద్రంలో 96.5 ఎకరాలకు పైగా టెక్స్‌టైల్‌ పార్కుకు కేటాయించారు. ఇప్పటివరకు టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న స్పిన్నింగ్‌ మిల్లులు మూత పడ్డాయి. చేనేత సహకార సొసైటీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లేకపోవడంతో ఉత్సవ విగ్రహంలాగా తయారయింది.
గతిలేని గుండ్రేవుల..
వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తానని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2019లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నిధులను కేటాయించారు. వైసిపి ప్రభుత్వం గుండ్రేవుల ఊసే ఎత్తలేదు.
చెరువులకు నీళ్లు అంతంతే
హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి ఉమ్మడి జిల్లాలోని 68 చెరువులకు నీటిని నింపుతామని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 77 చెరువులకు నీటిని నింపుతున్నట్లు ఈఏడాది జూన్‌ 1న ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్యాపిలి మండలంలో 19 చెరువులకు నీరందాల్సి ఉండగా ఒక్క చెరువులోకే నీరు చేరాయి. మద్దికెర మండలంలో ఒక్క చెరువుకూ చుక్క నీరు రాలేదు. తుగ్గలి మండలంలో 13 చెరువుల్లో రెండింటికి అరకొరగా నీటిని విడుదల చేశారు. పత్తికొండ మండలంలో చందోళి చెరువులోకి సగం నీరు చేరగా చక్రాళ్ల, పత్తికొండ చెరువులకు చుక్కనీరు చేరలేదు.
మరిన్ని హామీల అమలు ఇలా..

  • వైసిపి అధికారం చేపట్టిన నెల రోజులకే గాజులదిన్నె నుంచి పైపులైన్‌ ద్వారా కోడుమూరుకు తాగునీరు తెస్తామని, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికీ పట్టించుకోలేదు.
  • ఎల్‌ఎల్‌సిని ఆధునికీకరించి, ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆదోని, ఆలూరు ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదోని పట్టణ జనాభాకు అనుగుణంగా మరో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒక్కటీ నెరవేరలేదు.
  • ఆలూరు నియోజకవర్గంలో శాశ్వత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. 15 ఏళ్లుగా శంకుస్థాపనకే పరిమితమైన నగరడోన రిజర్వాయర్‌ నిర్మించి చిప్పగిరి, ఆలూరు ప్రాంతాల్లో 4,200 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏదీ నెరవేరలేదు.
  • కోవెలకుంట్ల మండలంలో పర్యటిస్తున్నప్పుడు జొలదరాశి వద్ద కుందూనదిపై మినీ రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం కడప జిల్లాలోని దువ్వూరులో ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. భూసర్వే పనులు జరుగుతున్నాయి.
  • కెసి ఆయకట్టు స్థిరీకరణ కోసం సాగునీటి వనరులను సమకూరుస్తామని ఆళ్లగడ్డ పర్యటనలో హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు.
  • 90 శాతం పనులు పూర్తయిన పులికనుమ ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తి చేస్తామని 1.232 టిఎంసిలు నిల్వ చేసి 26,400 ఎకరాలకు సాగు నీరు అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ పట్టించుకోలేదు.