Nov 22,2022 22:07

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల కేంద్రంలోకి ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక తహశీల్దార్‌ మురళీకృష్ణకు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ కారనంతో నెల రోజులుగా ఆర్డినరీ, ఎక్స్‌ ప్రెస్‌ బస్సులు సోమందేపల్లిలోకి రావడంలేదన్నారు. దీంతో మండల కేంద్రం నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సుమారు ఒక కిలోమీటర్‌ దూరంలో ఉన్న వైయస్సార్‌ సర్కిల్‌, కొత్తపల్లి క్రాస్‌ వద్దకు వెళ్లాల్సివస్తోందన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. గ్రామంలో నుండి బస్సులు వెళ్లే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెద్దన్న, హనుమయ్య, మండల నాయకులు వెంకటేష్‌, రంగప్ప, కొండా వెంకటేష్‌, నాగభూషణ, గ్రామస్తులు వరలక్ష్మి, చంద్రకళ, గంగరత్న తదితరులు పాల్గొన్నారు.