- డ్వామా పీడీ సునీత
ప్రజాశక్తి-విజయవాడ: ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి, రూరల్ మండలాభివృద్ది అధికారి జె సునీత అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలంలో ఉపాధి హామిలో జరుగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణ పనుల ప్రగతిని మంగళవారం డ్వామా పిడి, రూరల్ మండలాభివృద్ధి అధికారి జె.సునీత పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామి పథకం కింద 30 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంగా నిర్థేశించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తీసుకున్న చర్యల వలన ఇప్పటివరకు లక్ష్యాలను మించి రికార్డు స్థాయిలో 47 లక్షల పని దినాలను కల్పించి జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. విజయవాడ రూరల్ మండలంలో లక్ష 68 వేల పనిదినాలు కల్పించామన్నారు.ప్రభుత్వ భవన నిర్మాణాలలో భాగంగా విజయవాడ రూరల్ మండలంలో 23 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా 21 భవనాల నిర్మాణాల పనులు ప్రారంభం కాగా, వీటిలో ఆరు భవనాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో ఆరు భవన నిర్మాణాలు తుది దశలోను, ఐదు భవన నిర్మాణాలు రెండు స్లాబ్లు పూర్తి అయ్యాయని, రెండు భవనాలు బేస్మెంట్ దశలోను, మరో రెండు బిలో బేసిమెంట్ స్థాయిలోను, ఇంకనూ రెండు భవన నిర్మాణాల పనులను ప్రారంభింపవలసి ఉందన్నారు. మండలానికి మంజూరైన 19 రైతు భరోసా కేంద్రాలకు గాను 4 పూర్తి అయ్యాయని, ఒక భవన నిర్మాణం తుది దశలో ఉందని, రెండు భవనాలు స్లాబ్ దశలలోను, మిగిలినవి బిలో బేసిమెంట్ స్థాయిలో ఉన్నాయని అన్నారు. మంజూరైన 29 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలలో మూడు పూర్తి అయ్యాయని, మరొకటి తుది దశలో ఉందన్నారు. నాలుగు భవనాలు స్లాబ్ దశలోను, ఒక భవనం బేస్మెంట్ దశలోను ఉందన్నారు. మిగిలిన 20 భవనాలు బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ భవన నిర్మాణాల మెగా మేళాలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చిందని మండలానికి కేటాయించిన ప్రభుత్వ భవనాలను నిర్థేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని డ్వామా పిడి సునీత కోరారు.ప్రభుత్వ భవన నిర్మాణల పరిశీలనలో తహాశీల్థార్ శ్రీనివాస్ నాయక్, ప్రంచాయతీ రాజ్ డిఇ శ్రీనివాస్, ఎఇ యన్. శివరామ కృష్ణ, గూడవల్లి సర్పంచ్, సముద్రవేణి, యంపిపిి వెంకటరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










