Feb 17,2023 20:06

మాట్లాడుతున్న ఆస్కార్‌రావు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు
ప్రజాశక్తి-రాయచోటి : ఉద్యోగ సమస్యలు పరిష్కారం కాకుంటే ఏప్రిల్‌ నుండి దశలవారీగా ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయంలో జిల్లా స్థాయి ఉద్యోగుల సమావేశం జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్కార్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు బకాయిపడ్డ ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించకపోవడం, ఉద్యోగుల జిపిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ సేవింగ్స్‌ ఖాతాల నుండి రుణాలు విడుదల చేయకపోవడం, జీతాలు సకాలంలో పడకపోవడం, పిఆర్‌సి సమస్యలు పరిష్కారం చేయకపోవడం పట్ల ఉద్యోగులలో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని తక్షణం ప్రభుత్వం స్పందించాలని విన్నపం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు చెల్లింపు చేయాలని, 11వ పిఆర్‌సి ద్వారా రావలసిన ఆర్థిక ప్రయోజనాల బకాయిల చెల్లింపుల షెడ్యూల్‌ ప్రకటించాలిన్నారు. ఉద్యోగుల జిపిఎఫ్‌ ఖాతాల నుండి అనుమతి లేకుండా విత్‌ డ్రా చేసిన రూ.480 కోట్లను తిరిగి చెల్లింపు చేస్తారో చెప్పాలన్నారు. ఉద్యోగులకు రావలసిన సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ విధిగా ప్రతి ఏటా నిర్దిష్ట కాలపరిమితిలోగా చెల్లించాలన్నారు. ఉద్యోగులకు చెందాల్సిన ఎల్‌టిసి హోమ్‌ టౌన్‌ సదుపాయాలను నిర్దిష్ట కాలపరిమితి అనుమతించాలి. ఉద్యోగులకు రావలసిన టూరు సమయంలో టిఎ, డిఎ, ఎఫ్‌టిఎలు నిర్ణీత కాలపరిమితి విధించి చెల్లించాలిన్నారు. ఉద్యోగుల కొన్ని శాఖల ఉద్యోగులు అద్దె భవనాలతో స్వంత ఖర్చులతో కార్యాలయాలను నిర్వహిస్తునందున (వైద్య, ఆరోగ్య శాఖలో ఎఎస్‌ఎంలు ఉపకేంద్రాల నిర్వహణ, సెక్టారు కార్యాలయాల నిర్వహణ) వాటిని మంజూరుచేసి నిర్దిష్ట కాలపమితిలోగా చెల్లిస్తారో తెలియచేయాలని పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు సకాలంలో అందజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌రాజు, కార్యదర్శి ఎస్‌.బాబా సాహెబ్‌, కృష్ణా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ బాబు, విశాఖ జిల్లా కార్యదర్శి రవి శంకర్‌, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాలాజీ, జిల్లా కోశాధికారి సుధాకర్‌ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డినాయక్‌, వివేకానంద, రెవెన్యూ సంఘం అధ్యక్షులు రమేష్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్మెంట్‌ రమేష్‌, కృష్ణవేణి, తాలూకా అధ్యక్షులు సాయి కుమార్‌, కార్యదర్శి సుజిత్‌, శ్రీనివాసులు నాయక్‌, సదాశివారెడ్డి, వలి, కవిత, సావిత్రి, హౌస్‌ బిల్డింగ్‌ డైరెక్టర్‌ సిద్దయ్య, రాజా కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ స్టేట్‌ కన్వీనర్‌ విశ్వనాథ్‌ రెడ్డి, జిల్లాలోని తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.