ప్రజాశక్తి-రాయచోటి : ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీష ఎన్నికల జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ విసి హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ, తదితర ఏర్పాట్లపై ఎన్నికల జిల్లా నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలి ఎన్నికలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని వసతులతో సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. చెక్లిస్ట్ ఆధారంగా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేలా పంచాయతీరాజ్ ఇంజినీర్లతో సమన్వయమయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీరాజ్ ఎస్ఇని ఆదేశించారు. ఎలాంటి చిన్న పొరబాటు లేకుండా ఎన్నికలను నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 ఇవ్వాలని సూచించారు. బుధవారం నాటికి అన్ని డివిజన్లకు మెటీరియల్ చేరుకోవాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎంసిసి, వెబ్ కాస్టింగ్, తదితర వాటిపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఒ సత్యనారాయణ, నోడల్ అధికారులు పాల్గొన్నారు.










