విద్యార్థిని చరణి
ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో
జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
-ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని ఎస్.చరణి
నెల్లూరు :కెఎన్ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.చరణి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో అత్యంత ప్రతిభను కనపరిచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.విజయప్రకాష్ తెలియజేశారు. స్థానిక భక్తవత్సలనగర్ ప్రాంతంలోని కెఎన్ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో 155/180 మార్కులు సాధించడంతో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థిని ఎస్.చరిణిని జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్ఎస్ గంగా భవాని, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సిహెచ్ ఉషారాణిలు అభినందించారు.జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ ఈ పాఠశాల అధ్యాపకులను, ప్రధానోపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకొని తమ పాఠశాలల విద్యార్థులను తీర్చి దిద్దాలని పిలుపు నిచ్చారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే విధంగా శిక్షణిచ్చి ప్రోత్సహించిన ప్రధానోపాద్యాయుడు ఎం.విజయప్రకాష్ను, అధ్యాపక బృందానికి విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.










