Nov 17,2023 21:57

ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై బొజ్జల సుధీర్‌రెడ్డి ఫైర్‌

ఎమ్మెల్యే భూదాహానికి అడ్డే లేదా : బొజ్జల సుధీర్‌
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, అడ్డు వచ్చిన వారిని తన అనుచర గణంతో అణచివేస్తూ వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను వదలకుండా ఆక్రమించి వందల కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ బాధ్యులు బొజ్జల సుధీర్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి తన అనుచర గణంతో మండలం, గ్రామపంచాయతీలలో ఉన్న ప్రభుత్వ భూములను బినామీలను ఏర్పాటు చేసుకుని తన వశం చేసుకుంటున్నారని అన్నారు. ఒక్క రేణిగుంట మండలంలోని 556 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, కాలువ పోరంబోకు, చెక్‌ డ్యామును తన బినామీ అయిన పి.మునిరెడ్డి ఆక్రమించుకున్నాడని, దీనిపై క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నుండి జిల్లా కలెక్టర్‌ కు తగిన ఆధారాలతో అర్జీలు ఇచ్చినా బుట్ట దాఖలు అవుతున్నాయన్నారు. రేణిగుంట మండలంలోని వెంకటాపురం, అన్నాస్వామి పల్లి, ఆర్‌.అగ్రహారం, తిరుపతి అర్బన్‌ పరిధిలోని చెన్నాయిగుంట ప్రాంతాల్లోని సర్వే నంబర్లు 261లో 6.5 ఎకరాలు, 385లో 31.65, 364లో 3.82, 368లో 0.5, 335లో 4.46, 338లో 5.48, 341లో 8.66, 359లో 8.25, 222/5లో 8.33 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 217లోని చెక్‌డ్యాంను మునిరెడ్డి ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌ నగర్‌ లో సర్వేనెంబర్‌ 231, 232, 233, 234 లోని 18 ఎకరాల భూమిలో 250 ఫ్లాట్లు వేసి 15 లక్షల రూపాయల లెక్కన అమ్ముకుంటున్నారన్నారు. శ్రీకాళహస్తి పరిధిలో ఆర్మీ జవాన్లకు కేటాయించిన భూమిని కూడా లిటిగేషన్కు తెప్పించి భూ కబ్జాకు పాల్పడ్డారన్నారు. తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో 70 ఎకరాల్లో 200 మంది ఇల్లు కట్టుకొని నివసిస్తుంటే ఆ స్థలంపై ఎమ్మెల్యే కన్ను పడిందని, ఉన్నపలంగా 200 ఇళ్లలోని పేదలను ఆ గ్రామం నుండే తరిమేసారన్నారు. చింతలపాలెం లో 70 ఎకరాలు, ఏర్పేడు మండలంలో సర్వేనెంబర్‌ 125/బి లోని 12 కోట్లు విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని, సర్వేనెంబర్‌ 36లో 60 కోట్లు విలువైన 12 ఎకరాల భూమిని ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోం దన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం డికేటి భూములను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడంతో, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు రాకమునుపే ఎమ్మెల్యే బినామీ అక్కుర్తి మధు, సుధాకర్‌ రెడ్డి రైతుల వద్దకు వెళ్లి వారి ఆధీనంలోని డీకేటి భూములను తక్కువ ధరకే అగ్రిమెంట్‌ చేయించుకొని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవాలని పథకం రచించారన్నారు. ఇవే కాకుండా సొంత పార్టీ నాయకుడు జయకష్ణ ఆస్తిని కూడా లాగేసుకున్నారన్నారు. ఎమ్మెల్యే ఆగడాలపై అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులకు అందించినా అధికారులు పరిశీలిస్తామంటారు తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదని, రాబోవు ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేకు తమ ఓటుతో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ఎంఎల్‌ఎ బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై బొజ్జల సుధీర్‌రెడ్డి ఫైర్‌