విలేకరుల సమావేశంలో కలెక్టర్ గిరీష
ప్రజాశక్తి-రాయచోటి : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అసవరమైన అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసిందని చెప్పారు. నోటిఫికేషన్ను 16న విడుదల, 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తామని చెప్పారు. 24న పరిశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపంసహణకు 27వ తేదీ ఆఖరన్నారు. మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియను మార్చి 21లోగా పూర్తిచేస్తామన్నారు. కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 22,542 మంది, కడప, అనంతపురం, కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 2031 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 23,776 మంది, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 1534 మంది ఓటర్లు కలరన్నారు. జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లు 46,318 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 3,565 మంది కలరన్నారు. ప్రతి మండలంలో ఎంసిసి టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడను నియమిస్తున్నామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మ్యాన్ పవర్ ఐడెంటిఫై చేసి, వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మండలానికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం, ఎక్కువ మంది ఓటర్లు ఉంటే అక్కడ రెండు పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పోలింగ్ కేంద్రాలు 44, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డిఆర్ఒ సత్యనారాయణ పాల్గొన్నారు.










