Nov 08,2023 22:51

ప్రజాశక్తి-రాజోలు ప్రభుత్వ అలసత్వ వైఖరి వల్లనే రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ దళిత చైతన్య వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజోలు మండలంలోని వేగివారిపాలెంలో బుధవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత చైతన్య వేదిక నాయకులు దళితులపై దాడులు అరికట్టాలంటూ నినాదాలు చేశారు. ఎన్టీయార్‌ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శ్యామ్‌కుమార్‌పై అత్యంత అమానుషంగా దాడి చేసిన వారికి త్వరగా శిక్ష పడేందుకు పాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చెయ్యాలన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడుల పట్ల రాజకీయ పార్టీలకతీతంగా దళితులు ఐక్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకష్ణ, ముఖ్య సలహాదారు బొడ్డపల్లి పుల్లయ్య, రాష్ట్ర దళిత గిరిజన ఆదివాసీ సంఘం కన్వీనర్‌ చిలకపాటి శ్రీధర్‌, ఎంఆర్‌పిస్‌ జిల్లా నాయకులు చుట్టుగుళ్ల సత్యనారాయణ, పాముల హర్షవర్ధనరావు, చింతా మధుకుమార్‌, చవ్వాకుల రాము తదితరులు పాల్గొన్నారు.