Nov 10,2023 20:44

మాట్లాడుతున్న ఆనంద్‌ బాబు

ప్రజాశక్తి - గోనెగండ్ల
దళితులపై కొనసాగుతున్న ఆధిపత్య వర్గాల వివక్షతో పాటు అధికార వివక్షను కూడా తోడుగజేసి ఇంకెంత కాలం దళితులను సమస్యల అగాధంలో ఉంచుతారని ఆంధ్రప్రదేశ్‌ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డి.ఆనంద్‌ బాబు విమర్శించారు. శుక్రవారం గోనెగండ్లలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో డప్పు కళాకారుల సంఘం సమావేశం మండల కార్యదర్శి పెద్ద కర్రెన్న అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆనంద్‌ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కరుణాకర్‌ హాజరయి మాట్లాడారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏళ్లు పూర్తయినా నేటికీ దళితుల పట్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. వార్షిక బడ్జెట్‌లో దళితులకూ కేటాయించాల్సిన నిధుల దగ్గర మొదలైన వివక్ష అన్నిచోట్లా కొనసాగుతోందని తెలిపారు. 2013 దాకా డప్పుకు ప్రభుత్వ గుర్తింపే లేదన్నారు. పోరాడి గుర్తింపును, పింఛన్లు సాధించినా వాటిని ఎలా తీసేయాలనే ఆలోచనలోనే ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. డప్పు కళాకారుల సంఘం మండల ఉపాధ్యక్షులు దేవదాసు, చిన్న కర్రెన్న, నరసింహుడు, ఆదాము, ఈరప్ప, చిన్న మద్దిలేటి, మాణిక్యం, పెద్దయ్య, నడిపి దస్తగిరి, శివ, మరో 20 మంది డప్పు కళాకారులు పాల్గొన్నారు.