డిఎంహెచ్ఒ ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : గర్భిణులకు, 0-5 చిన్నారులకు సిబ్బంది అందిస్తున్న వ్యాక్సేషన్ను డిఎంహెచ్ఒ పెంచలయ్య ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. బుధవారం స్థానిక బిట్-2 సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు వైద్య సిబ్బందికి చేశారు. అనంతరం జరిగిన నులిపురుగుల మాత్రల పంపిణీపై ఆరా తీశారు. సిబ్బంది 93 శాతం విద్యార్థులకు పంపిణీ చేశామని తెలపడంతో డిఎంహెచ్ఒ సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిజన్ కూడా ఇదేస్థాయిలో నిర్వహించాలన్నారు. రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ లవణ ద్రవాలు సిద్ధంగా వైద్యశాలలో ఉంచుకోవాలన్నారు. అవసరం ఉంటే ఎండలో బయటికి వెళ్లాలి తప్ప అనవసరంగా తిరగవద్దు అని ప్రజలను కోరారు. మధ్యాహ్నం 12 లోపల పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవాలన్నారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, సూపర్వైజర్ అక్బర్ బాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










