న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలకు చెందిన సంయుక్త ఫోరమ్ ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె సోమవారం ఉదయం ప్రారంభమైంది. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మెలో బ్యాంక్ ఉద్యోగులు, ఇతర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది అధికారిక, అనధికారిక కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు. జార్ఖండ్, చత్తీస్ఘర్, మధ్యప్రదేశ్లోని మొత్తం కోల్ మైనింగ్ బెల్ట్లోని కార్మికులు నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు నిరసన తెలుపుతున్నాయి. కేరళలో బంద్ ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుండి అత్యవసర సేవలను మినహాయించారు. రైల్వే స్టేషన్స్, ఆస్పత్రులు వెళ్లే ప్రయాణికుల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమబెంగాల్లో పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలువురు వామపక్ష కార్యకర్తలు కోల్కతాలోని జాదవ్పూర్, డుమ్డుమ్, బారాసత్, బెల్గారియా, జోరునగర్, దోమ్జూర్ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్లపై బైఠాయించారు. గోల్పార్క్, లేక్ టౌన్, బగౌతియాలతో పాటు కోల్కతాలోని పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్భందించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లోనూ సమ్మె కొనసాగుతోంది.
















