ఉత్తర్ప్రదేశ్ : రూ.45 లక్షల కోసం మరిదితో కలిసి భర్తనే చంపింది ఓ భార్య. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని గర్హీ షాహ్ దరాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.... అజిత్, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని గర్హీ షాహ్ దరాలో నివాసముంటున్నారు. ఇటీవల అజిత్ ఓ ఫ్లాట్ను అమ్మగా రూ.45 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును బ్యాంకులో వేశాడు. ఎలాగైనా బ్యాంక్లో ఉన్న డబ్బును రాబట్టాలని కవిత తన మరిదితో కలిసి కుట్ర పన్నింది. అజిత్ను చంపి బులంద్షహర్కల్పా గ్రామం వద్ద ఉన్న నదిలో పడేసింది. అజిత్ కనబడకపోవడంతో అనుమానం వచ్చిన అతని మేనల్లుడు సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. తర్వాత అనుమానం వచ్చి అజిత్ భార్యను తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కవితతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.