- ప్రారంభమైన చర్చలు
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి
సిపిఎం 23వ అఖిల భారత మహాసభలో కీలకఘట్టం ప్రారంభమైంది. రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని, దానికి వచ్చిన సవరణలను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బుధవారం సాయంత్రం మహాసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ప్రతినిధులు బృందాలుగా ఏర్పడి రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చలు ప్రారంభించారు. రాత్రి భోజనం అనంతర పొద్దుపోయేంత వరకు గ్రూపు చర్చలు కొనసాగాయి. దీనిపై చర్చలు రెండవ రోజు కూడా కొనసాగనున్నాయి.
- మహాసభ నిర్వహణకు ఐదు కమిటీలు
సిపిఎం మహాసభ నిర్వహణ నిమిత్తం మొత్తం ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. ఏడుగురితో అధ్యక్షవర్గం, పొలిట్బ్యూరో సభ్యులతో స్టీరింగ్ కమిటీ, ఏడుగురితో తీర్మానాల కమిటీ, ఐదుగురితో అర్హతల కమిటీ, ఎనిమిది మందితో మినిట్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అర్హతల కమిటీలో వై.వెంకటేశ్వరరావు (ఆంధ్రప్రదేశ్), మినిట్స్ కమిటీలో ఆర్.సుధాభాస్కర్ (తెలంగాణ) సభ్యులుగా ఉన్నారు.










