CPM Congress : కళ్లకు కట్టిన పోరాటాల చరిత్ర - నాటి నేటి ఉద్యమాల మణిహారం
- వేలాది మంది సందర్శకులతో చారిత్రక ఎగ్జిబిషన్ కిటకిట
కె.వరదరాజన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : చారిత్రక పోరాటాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటకిటలాడింది. వేలాదిమంది సందర్శకులు నాటి పోరాటాలను చర్చించుకుంటున్నారు. పోరాట చరిత్ర కళ్లకు కట్టినట్టు ఎగ్జిబిషన్ వివరించింది. నాటి నేటి ఉద్యమాల మణిహారమే ఈ ఎగ్జిబిషన్. సిపిఎం 23వ అఖిల భారత మహాసభ సందర్భంగా ఇక్కడి కె.వరదరాజన్ నగర్ (కలెక్టరేట్ గ్రౌండ్స్)లో చారిత్రాత్మక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్లోకి ప్రవేశించగానే మహోన్నత కమ్యూనిస్టు నేత ఎకె గోపాలన్ విగ్రహం స్వాగతం పలుకుతోంది. ఆ వెంటనే మార్క్సిస్టు మహోపాధ్యాయులు కారల్ మార్క్స్, లెనిన్, ఎంగెల్స్ పలకరించే విధంగా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి దేశంగా జరిగిన చారిత్రిక ఘట్టాలు, స్వాతంత్ర పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలు మనల్ని చరిత్రలోకి చేయిపట్టి తీసుకువెళతాయి. వివిధ పోరాటాలను ప్రతిబింబించే పెయింటింగ్స్ ఆలోచనల్లోకి తీసుకెళ్తాయి.
1939లో తొలిసారి జరిగిన పినరయి పరప్రమ్ సమ్మేళనం ఘట్టాన్ని వివరించే విధంగా కళాఖండం వద్ద సందర్శకులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరాట కథనాలను వివరించే కళారూపాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నాటి చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పశ్చిమ బెంగాల్ తెబాగా ఉద్యమం, మహారాష్ట్ర వర్లీ ఆదివాసీ పోరాటం, వున్నప్ర వాయిలార్ పోరాటం నుంచే నిన్న మొన్నటి చారిత్రాత్మక రైతు పోరాటం వరకు పోరాట దశలను వివరించే ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేకంగా నిలిచింది. మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు అనేక కమ్యూనిస్టు నేతల విగ్రహాలు ఎగ్జిబిషన్లో ప్రథమంగా నిలిచాయి. కమ్యూనిస్టు చరిత్రను వివరించేందుకు రెండు మినీ థియేటర్లను ఏర్పాటు చేశారు. కయ్యూరు ఉద్యమాన్ని వివరించే కళారూపాలను చూసిన సందర్శకులు నాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలను వివరించే కళాఖండాలు ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా నిలిచాయి. వ్యాగన్ మారణకాండను కళ్లకు కట్టినట్టు వివరించారు. కేరళలోని కోజికోడ్లో థోల్వీరాక్ పోరాటం, కూథుపారమ్ పోరాటాలను వివరిస్తూ కళాఖండాలు ఆలోచింపజేశాయి. మహిళ రిజర్వేషన్, మహిళా పోరాట ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక మహిళ గ్యాలరీ ఏర్పాటు చేశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రుల చిత్రాలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. భారతదేశ పోరాట చరిత్ర అణువణువూ కళ్లకు కట్టినట్టు చూపించారు. కేరళ చేనేత వస్త్రాలను ప్రదర్శించారు. కేరళ వంటకాలతో ఫుడ్ స్టాల్స్, ప్లానిటేషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి కళా ఖండం వద్ద సందర్శకులు ఛాయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. కేరళలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులు, రోజుకు దాదాపు ఐదు వేల మంది ఎగ్జిబిషన్ను సందర్శిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
- కేరళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఉత్పత్తులు
కేరళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఉత్పత్తులు ఉట్టిపడేలా పోలీస్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేరళ ఉత్పత్తులు ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేశారు. ''కేరళ నెంబర్ 1'' పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో రాష్ట్ర అభివృద్ధిని ప్రముఖంగా ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు వివరించే విధంగా స్టాల్స్ ఉన్నాయి. చేనేత మగ్గాలు, మట్టి పాత్రలు, పచ్చళ్లు, ఇతర కేరళ వంటకాలు ఏర్పాటు చేశారు. కేరళ ప్రభుత్వ విభాగాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. విద్యా రంగంపై ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. సిల్వర్ లైన్ ప్రాజెక్టు ప్రచారంలో భాగంగా భారీ త్రీడీ తెరను ఏర్పాటు చేశారు. కేరళ పోలీస్, టూరిజం, వైద్యం, వ్యవసాయం, పర్యాటకం వంటి ప్రభుత్వ విభాగాలు పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వివిధ రంగాలకు చెందిన దాదాపు మూడు వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు.


















