Oct 27,2023 07:52

తిరువనంతపురం :  పాఠశాల టెక్ట్స్‌ పుస్తకాల్లో ఇండియా పేరును భారత్‌గా ఉపయోగించాలన్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సిఇఆర్‌టి) ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరిస్తుందని సిపిఎం పేర్కోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సిలబస్‌ను అనుసరించే పాఠశాలలు ఎన్‌సిఇఆర్‌టి ప్రతిపాదనను అడ్డుకుంటాయని అన్నారు. సైన్స్‌, వాస్తవం మరియు చరిత్రను వ్యతిరేకించే సంఘ్ పరివార్  మూకలు భారత దేశ గతాన్ని మార్చి యువతరం మెదళ్లలోకి చొప్పించాలని యత్నిస్తోందని అన్నారు. కేరళలోని పాఠశాల పాఠ్యపుస్తకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో సూచించిన విధంగా దేశం పేరును ఇండియాగా పేర్కొంటాయి. సంఘ్ పరివార్  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన '' డార్విన్‌ పరిణామ సిద్దాంతం, మొఘలుల చరిత్ర, మహాత్మాగాంధీ జీవితం, హత్య'' అధ్యాయాలను పాఠ్యపుస్తకాలలో కొనసాగిస్తాయని పేర్కొన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటవుతున్న ప్రతిపక్షాలు తమ వేదికకు ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా)గా పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో బిజెపి ఆగ్రహంతో పాఠ్యపుస్తకాలు, అధికారిక ఆహ్వానాలు, ఇతర ప్రభుత్వ అంశాలలో దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్‌గా ముద్రిస్తోందని అన్నారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని కూడా కేంద్రం తిప్పికొట్టిందని అన్నారు.  ఇండియా, భారత్ చర్చలో కాంగ్రెస్,  సిపిఎం కూడా  ఒకే పక్షంలో నిలిచాయి.  బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి. వేణుగోపాల్ కూడా ఎన్‌సిఇఆర్‌టి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ చరిత్రను వక్రీకరించేందుకు యత్నిస్తోందని అన్నారు. 

కర్ణాటకలోని కాంగ్రెస్‌, తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వాలు కూడా ఎన్‌సిఇఆర్‌టి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. సిపిఎం కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జాబితాలో విద్య అంశాన్ని చేర్చడంతో ఎన్‌సిఆర్‌ఇటి ప్రతిపాదనను వ్యతిరేకించడానికి లేదా ఆమోదించడానికి రాష్ట్రాలను అనుమతిస్తుంది.