కడప ప్రతినిధి గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పైడిపాలెం ప్రాజెక్టుల సుందరీకరణకు మోక్షం లభించింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రావతి రిజర్వా యర్లో పడవల విహారం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చిత్రావతి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో పైడిపాలెం రిజర్వాయర్ను సైతం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నీటి పారుదలశాఖ కసరత్తు చేపట్టింది. జిల్లా నీటి పా రుదలశాఖ సూపరింటెండింగ్ ఇంజినీరింగ్ యంత్రాంగం చిత్రావతి రిజర్వాయర్ సుందరీకరణ నిమిత్తం రూ.14 కోట్లు, పైడిపాలెం రిజర్వాయర్ సుందరీకరణ నిమిత్తం రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం స్పందించి తాజాగా జిఒను విడుదల చేసింది. జిల్లా నీటిపారుదలశాఖ త్వరలో టెండర్ల నిర్వహణకు కసరత్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సుందరీకరణ పనుల్లో భాగంగా పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా వారి సందర్శన నిమిత్తం రహదారులు, లైటింగ్ సిస్టమ్, గడ్డిపెంపకం అవసరమైన ప్రదేశాల్లో సేదతీరడానికి అవసరమైన భవన సముదాయం వంటి సదుపాయాలను ఏర్పాటు చేసే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.










