May 30,2023 20:38

నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులు

 రాయచోటి టౌన్‌ : నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అక్రమ అడ్మిషన్లపై, ఫీజుల దోపిడీకి ప్పాలడుతున్న భాష్యం పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎఫ్‌ఎస్‌ అధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఐఎఫ్‌ఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టిపల్లి సాయి కుమార్‌ మాట్లాడుతూ మమ్మల్ని ఎవరేమి చేసుకుంటారంటూ కాలరేగుసుకొని విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న భాష్యం స్కూల్‌ వైపు జిల్లా విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణమని వాపోయారు. విద్యను భాష్యం స్కూల్‌ వ్యాపారంగా మార్చేసిందని వాపోయారు. అపద్దపు ప్రచారం చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే భాష్యం స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకొని స్కూల్‌ గుర్తింపు రద్దు చేయాలన్నారు. స్కూల్‌ బస్సులు సంబంధించి ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ బస్సులు నడుపుతున్నా కనీసం బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వేల రూపాయలు ఫీజులు కట్టించుకుంటున్న కనీసం అర్హత కలిగిన ఉపాధ్యాయులు కూడా లేకపోవడం దారుణం అన్నారు. భాష్యం స్కూల్‌ పైన చర్యలు తీసుకునేంతవరకు దశలవారుగా పోరాట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎఫ్‌ఎస్‌ భానుప్రకాష్‌, శివతేజ, నరేష్‌ ఉపేంద్ర పాల్గొన్నారు.