కంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాడే వంట గ్యాస్ ధరను అమాంతంగా పెంచేసింది. వంట సిలిండర్పై రూ.50 , వాణిజ్య సిలిండర్పై రూ. 350 పెంచుతూ సామాన్యులపై బండ భారం మోపింది. దీంతో జిల్లాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు తమ నిరసనను తెలియజేశారు. కడప నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో సిలిండర్లను చెత్త బండిలో వేసి ర్యాలీ చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. తక్షణమే రద్దు చేయాలి
కడప అర్బన్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజానీకం మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతోందని, తక్షణమే ఆ భారాలను రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఐ.ఎన్. సుబ్బమ్మ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న పూలే సర్కిల్లో గ్యాస్ ధరల పెంపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నగర కమిటీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుందని విమర్శించారు. 2014, మార్చిలో రూ.410 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1155 కు చేరిందని పేర్కొన్నారు. గహ వినియోగానికి వాడే వంటగ్యాస్ మీద రూ.50, వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ మీద రూ.350 భారం మోపడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు గ్యాస్ ధరలను పెంచి మరోవైపు విమాన ఇంధన ధరలను నాలుగు శాతం తగ్గించటం ఎవరి ప్రయో జనాల కోసమని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గు ముఖం పట్టినా, మన దేశంలో ఎందుకు ధరలు పెంచుతున్నారో ప్రజానీకానికి బిజెపి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వారన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నగర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రారెడ్డి, పారుక్ హుస్సేన్, ఓబులేసు, ఎమ్మార్ నాయక్, షంష్షాద్, అన్వర్, షాకీర్, రాజమణి, కామేశ్వరమ్మ, రియాజ్, సాదిక్, ఆర్కే నగర్ శ్రీను, గోపాల కష్ణయ్య, నారాయణ రెడ్డి, రమాదేవి, ప్రభాకర్, పండు, ఉదరు, ఇమామ్ పాల్గొన్నారు.
కార్పొరేట్ కంపెనీల కోసమా ? ప్రజల కోసమా?
జమ్మలమడుగు రూరల్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేది కార్పొరేట్ కంపెనీల ఆదాయం కోసమా ప్రజల సంక్షేమం కోసమా అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.మనోహర్ ప్రశ్నించారు. గురువారం స్థానిక పాత బస్టాండ్లో గ్యాస్ పెంపుదలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి రెండు కలిసి అనేక రూపాలలో ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పనులను పెంచుతూ దుర్మార్గ చర్యలకు పాల్పడుతుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక 16, 17 సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి వర్గాల నడ్డివిరుస్తున్నారన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోకపోగా కార్పొరేట్ కంపెనీలకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవడం దారునమన్నారు. పనిచేశాయన్నారు. రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి శివ నారాయణ, నాయకులు వినరు కుమార్, డేవిడ్, ప్రసాద్ రెడ్డి, హాజీ, సుబ్రమణ్యం, ప్రభాకర్ పాల్గొన్నారు.
గ్యాస్ ధరలు పెంచడం గర్హనీయం : తలసిరెడ్డి
వేంపల్లె : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ 50, వాణిజ్య సిలిండర్ పై రూ 350 లు పెంచడం గర్హనీయమని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. గురువారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014 ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర బ్యారెల్ 114 డాలర్లు ఉన్నప్పుడు ప్రజలకు వంట గ్యాస్ సిలిండర్ ను రూ 410 లకు సరఫరా చేసిందని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లే ఉన్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ 1200 చేయడం శోచనీయమని అన్నారు. గహిణులు వంట గదిలోకి పోవాలంటే భయపడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో అచ్చే దిన్ కు బదులు చచ్చే దినాలు దాపురించాయని తెలిపారు. సబ్ కా వికాస్ బదులు సబ్ కా వినాస్ జరుగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుందని తులసిరెడ్డి అన్నారు.
ప్రజాసంక్షేమం గాలికి : టిడిపి
కడప అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని, పెరిగిన గ్యాస్ ధరలపై టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపడ్డారు. టిడిపి జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో వంటింటి గ్యాస్ రూ, 415 రూపాయలు ఉన్న గ్యాస్ ధర నేటికీ మూడింతలు, వాణిజ్య వినియోగ గ్యాస్ ఏకంగా సిలిండర్ పై రూ, 300 పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభుత్వాలు బాదుడే బాదుడుకు సిద్ధపడ్డాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీలో డీజిల్ ధరలకు, పొరుగు రాష్ట్రాల్లో డీజిల్ ధరలకు చాలా వ్యత్యాసం ఉండడంతో వాహనదారులు అక్కడి డీజల్ను వాహనాలకు వినియోగిస్తున్నారని అన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ కాంట్రాక్టర్లను కుబేరులను చేస్తూ ఈ ప్రభుత్వం వినియోగదారులను దోపిడీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగం ఎక్కువ పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తూ, రేషన్ కార్డు లేదని పింఛన్ తొలగించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ప్రయోజనాలు పక్కన పెట్టి, పెంచిన గ్యాస్ త్వరలో పూర్తిస్థాయిలో తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్, నగర అధ్యక్షుడు శివకొండ రెడ్డి, ఆమూరి బాలరాజు, అమీర్, హరి పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజానీకం మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతుందని, తక్షణమే ఆ భారాలను రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి సగిలి గురప్ప డిమాండ్ చేశారు.










