* ప్యాకెట్ రూ.810
* కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వచ్చే ఏడాదికి బిటి పత్తి విత్తనాల ధరలను కేంద్రం పెంచింది. ప్రస్తుతం 450 గ్రాముల (120 గ్రాముల రిఫ్యూజ్ సీడ్ అదనం) ప్యాకెట్ ధర రూ.767 ఉండగా రూ.810కి పెంచింది. ఎకాయికిన ప్యాకెట్పై రూ.43 పెంచింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళవారం గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేయగా బుధవారం వెలుగులో కొచ్చింది. కాటన్ సీడ్ ప్రైస్ (కంట్రోల్) ఆర్డర్- 2015కు అనుగుణంగా ధరలు నిర్ణయించినట్లు గెజిట్లో తెలిపింది. బిటి సీడ్స్లో రెండు రకాలుండగా బిటి-1 సాగు ఐదు శాతానికి లోపే. బిటి-2 రకాన్నే అత్యధికంగా రైతులు సాగు చేస్తున్నారు. దాంతో బిటి-2 ధరలనే కేంద్రం పెంచింది. బిటి-1 ధర రూ.635లో ఎలాంటి మార్పు చేయలేదు. వ్యవసాయ సంక్షోభం, మాంద్యం, వాటికి తోడైన కరోనా... రెండేళ్లుగా రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సమయంలోనే కేంద్రం ఏటికేడు బిటి కాటన్ సీడ్ ధరలు పెంచుతోంది. 2019-20లో బిటి-2 సీడ్ ప్యాకెట్ ఎంఆర్పి రూ.730గా పేర్కొని, అందులో రూ.20 బేయర్ సంస్థకు ట్రైట్ వాల్యూగా నిర్ణయించింది. 2020-21లో ట్రైట్ వాల్యూ రద్దు చేసి ఎంఆర్పి రూ.730 కొనసాగించింది. 2021- 22లో 5 శాతం పెంచి ఎంఆర్పి రూ.767 చేసింది. మునుపటి ఏడాది కంటే ప్యాకెట్పై రూ.37 పెంచింది. ఇప్పుడు అదే ఒరవడి ప్రదర్శించి 2022-23కు రూ.810 చేసింది. ప్రస్తుతమున్న ఎంఆర్పిపై అదనంగా రూ.43 (5.6 శాతం) ఎక్కువ చేసింది. దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, ఎకరానికి రెండు ప్యాకెట్ల సీడ్ నాటుతున్నారు. ప్యాకెట్పై రూ.43 పెరిగితే రైతులపై రూ.260 కోట్లకుపైన అదనపు భారం పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఆ ప్రకారం మన రైతులపై ఏడాదికి అదనంగా రూ.13 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమిక అంచనా.
రైతులపై 40 కోట్ల భారం : ఎపి కౌలురైతుల సంఘం
బిటి2 విత్తనాలపై పెంచిన ధరను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై రాధాకృష్ణ, పి జమ లయ్య బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సాధారణ పత్తిసాగు 16.5 లక్షల ఎక రాలుందని, దీనికి సుమారు 50 లక్షల ప్యాకెట్ల విత్తనాలు రైతాంగం వాడుతోందని తెలిపారు. రైతులపై అదనంగా రూ.40 కోట్ల భారం పడు తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇన్పుట్స్ ధరలు పెరగడం వల్ల పత్తిసాగు భారంగా మారిందని తెలిపారు. కల్తీ విత్తనాల వల్ల పంట దిగుబడి బాగా తగ్గడంతో రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాలపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, నాణ్య మైన పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ ద్వారా రైతాంగానికి అందుబా టులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.










