ప్రజాశక్తి-రాయచోటి : బిజెపి, వైసిపి ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ రాయచోటి నియోజకవర్గం ఇన్ఛార్జి అల్లా బకాష్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి బిజెపి ఒక శనిగ్రహమన్నారు. రాష్ట్రానికి వైసిపి, టిడిపి రాహుకేతులని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమలను అమ్మేస్తున్నారని ఇక రాష్ట్రానికి వస్తే ఇసుక, మైనింగ్, గుట్కా, మారకద్రవ్యాలు, భూ కబ్జాలు లాంటి ఎన్నో గోరాలు నేరాలు జరుగుతున్న ప్రభుత్వంకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. మైనార్టీలపైన జరుగుతున్న దాడులను, దళితుల పైన జరుగుతున్న దాడులు అన్నీ కూడా వైసిపి నాయకులే చేస్తున్నారనీ విమర్శించారు. ఈ విధంగా రాష్ట్రాన్ని బ్రస్టు పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాలు అమలు చేస్తే దేశాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేస్తుందన్నారు. కేంద్రం నుండి బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు తెప్పించి, రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పరుస్తుందిన్నారు. విభజన చట్టంలో పేర్కొనబడి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అన్ని సమస్యలను నిర్ధిష్ట కాలవ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. రైతులకు రూ.3 లక్షలు వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తుందిన్నారు. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.6 వేలు ఆర్థిక సహాయం ఇవన్నీ అమలు చేస్తే రైతులకు ఉద్యోగులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అన్ని విధాల మేలు జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు చెన్నకృష్ణ, తాలూకా మహిళా ప్రెసిడెంట్ రవణమ్మ, రాయచోటి మండల ప్రెసిడెంట్ నాగయ్య, రాయచోటి మండల మహిళా ప్రెసిడెంట్ నాగలత పాల్గొన్నారు.










