
ప్రజాశక్తి-అమలాపురం ఈ నెల 12న దీపావళి పండుగ నేపథ్యంలో తాత్కాలిక బాణాసంచా వ్యాపారులు తప్పకుండా లైసెన్సులు పొందాలని లేనిపక్షంలో విక్రయ దారులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజరు హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆమె 22 మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీపావళి బాణసంచా విక్రయాలు అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు, అనుమతులు మంజూరు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణసంచా విక్రేతలు సంబంధిత రెవెన్యూ, పోలీస్ వాణిజ్య పన్నుల అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. అనుమతులు పొందిన వారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. షాపులు ఏర్పాటు, బాణసంచా అమ్మకాలకు సంబంధించి ప్రజలకు, ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా అధికారలు చూడాన్నారు. లైసెన్స్ లేని విక్రయాల ద్వారా ప్రమాదాలు సంభవిస్తే వారికి అమ్మినవారే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అనంతరం లంక భూముల పట్టాలు పంపిణీ, డేటా ఎంట్రీ, ఈనాం భూములు డేటా ఎంట్రీ, అసైన్ భూముల డేటా ఎంట్రీ పెండింగ్ అంశాల పురోగతిపై తహశీల్దార్లతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లర్ల సమన్వయంతో ఆన్లైన్ విధానంలో గోనె సంచులు సరఫరా చేయాలన్నారు. డిఆర్ఒ సిహెచ్.సత్తిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారథి, సిటిఒ టి.ధర్మారావు, సివిల్ సప్లరు మేనేజర్ ఎస్.సుధా సాగర్, సాంఘిక సంక్షేమ శాఖ పీడీ పి.జ్యోతిలక్ష్మి దేవి, డిపిఒ వి.కృష్ణకుమారి పాల్గొన్నారు.