రాయచోటి : బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, ఇది అందరి బాధ్యతని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సోమవారం పట్టణంలోని బంగ్లా కూడలి నుంచి జిల్లా చైల్డ్ లేబర్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వరకు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంపై అవగాహన ర్యాలీని నిర్వ హించారు. ఈ అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జండా ఊపి ప్రారం భించారు. అంతకమునుపు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో భాగంగా బాల కార్మిక నిర్మూలన కోసం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, పిల్లలను చదివించాలని ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. బాలలందరిని బడికి పంపించి భావి భారత పౌరులుగా తీర్చి దిద్దుదామన్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు, అన్ని శాఖల అధికారులు ఈ వ్యవస్థను నిర్మూలించడానికి కషి చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ కొన సాగడం వల్ల సమాజంలో అనిశ్చిత పరిస్థితులు పెరుగుతాయన్నారు. అందరూ తమ పిల్లలను చదివించాలన్నారు. తమ పరిధిలో ఎక్కడైనా బాలకార్మిక వ్యవస్థ ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలని, కఠిన చర్యలు తీసుకుం టామని చెప్పారు. కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధికారి డివి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఐసిడిఎస్ పీడీ ధనలక్ష్మి పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: పట్టణంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పిల్లలు బడికి పెద్దలు పనికి, పని వద్దు చదివే ముద్దు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దామంటూ నినాదాలు చేస్తూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్.బాబు, సంస్థ జనరల్ సెక్రటరీ కవిత రాణి, ఉపాధ్యాయులు, చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.










