Apr 21,2022 07:26
  • ఆగిన సచివాలయ, ఆర్‌బికెల పనులు
  • మూడేళ్లుగా బిల్లుల కోసం కాంట్రాక్టర్ల నిరీక్షణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె), వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణ పనులు నిలిచి పోయాయి. వైసిపి అధికారంలోకి రాగానే సచివాలయ, ఆర్‌బికె, హెల్త్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీలతోపాటు బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ (బిఎంసియు) 44,119ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో ఇప్పటి వరకు 28,989 భవన నిర్మాణాలు ప్రారంభమవ్వగా, 15,130 భవనాలకు పునాదే పడలేదు. ఇప్పటి వరకు 7,809 భవన నిర్మాణాలే పూర్తవ్వగా, ఇందుకోసం రూ.3,154.47 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. బేస్‌మెంట్‌, రూఫ్‌ లెవెల్‌, రెండో స్లాబ్‌, చివరి దశలో ఉన్నవాటికి ఇంకా బిల్లులు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలయ్యే మెటీరియల్‌ నిధులను ఖర్చు చేయాలని పంచాయతీరాజ్‌శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయితే మెటీరియల్‌ నిధులు విడు దల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో భవన నిర్మాణాలన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో సుమారు 10,898 గ్రామ సచివాలయాలు, మరో 10,328 ఆర్‌బికెలు, 8,509 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ సెంటర్లు, 4,485 డిజిటల్‌ లైబ్రరీలు, 9,899 బిఎంసియులన్నీ కలిపి 44,119 భవనాలను రూ.10,668.50 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 13 జిల్లాల్లో 676 మండలాలుండగా, ఒక్కో మండలంలో ఐదారు భవనాలు మినహా మిగిలినవన్నీ అసంపూర్తిగానే ఉన్నట్లు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగు విభాగం అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో, కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు నిలిపివేశారు. పలుకుబడి ఉన్న అధికార పార్టీ నాయకులకు మాత్రం అరకొరా బిల్లులు మంజూరవుతున్నాయి. రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.7,800 కోట్ల విలువైన ఉపాధి పనులు జరిగాయి. మట్టి పనుల విలువ ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.3,284.66 కోట్ల మెటీరియల్‌ నిధులే మంజూరవుతాయి. మెటీరియల్‌ నిధులను విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర తాత్సారం చేస్తుండటం భవన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మూడు విడతల్లో రూ.1,900 కోట్ల మెటీరియల్‌ నిధులు విడుదలవ్వగా, ఇంకా రూ.780 కోట్లపైనే నిధులు రావాల్సి ఉంది. అవి వచ్చినా పెండింగు బిల్లులు చెల్లించేందుకు చాలవని పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు.
 

                                               నేడు మంత్రి ముత్యాలనాయుడు సమీక్ష

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖపై ఆ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా సచివాలయాలు, ఆర్‌బికె, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణాలపైనే ఫోకస్‌ పెట్టనున్నట్లు తెలిసింది. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను పునరుద్ధరించడంతోపాటు పెండింగు బల్లులను క్లియర్‌ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.

 

11