ఆర్టిసి రోడ్డు భద్రతావారోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి గంటలోనే వైద్యం అందించగలిగితే వారి ప్రాణాలను కాపాడడం సాధ్యపడుతుందని కావలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టిసి గ్యారేజీలో రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుందరరావు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం లేదా మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాలలో గంటకు 16 మంది మరణిస్తున్నారని, వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఈ మరణాలను నివారించవచ్చని పేర్కొన్నారు. మంచి ప్రదాత చట్టం (గుడ్ సమరిటన్ లా) ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు సేవలందించే వారికి తగు ప్రోత్సాహం లభిస్తుందని, వారు ఎలాంటి విచారణలకు హాజరుకానవసరం లేదని ఆయన వివరించారు. ప్రజలు ఈ చట్టంపై అవగాహన పెంచుకుని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ మరణాలను నివారించాలన్నారు. కావలి డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ వారమంతా డ్రైవర్లకు అవగాహనా కార్యక్రమాలు, వైద్య పరీక్షలు, కుటుంబ కౌన్సిలింగ్, ప్రథమ చికిత్స రక్తదాన శిబిరం, ఉత్తమ డ్రైవర్లకు సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) కెవిఆర్ బాబు, గ్యారేజ్ ఇన్చార్జి ఖాజామొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు.










