ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : గత మహాసభ నుంచి ఈ మహాసభకు మధ్య అమరులైన నాయకులు, కార్యకర్తలకు, ఇతరులకు సిపిఎం 23వ మహాసభ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం నాడిక్కడ మహాసభ ప్రారంభంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ ఈ మేరకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమరులకు సంతాప సూచకంగా సభకు హాజరైన ప్రతినిధులు, పరిశీలకులు, అతిథులు మౌనం పాటించారు. గత మహాసభ నుంచి ఈ మహాసభ మధ్య సిపిఎం అనేక మంది నాయకులను, కార్యకర్తలను కోల్పోయిందని మాణిక్ సర్కార్ అన్నారు. సిపిఎం నేతలు నిరుపమ్ సేన్, కె.వరదరాజన్, బిజన్ ధర్, గౌతం దాస్, శ్యామల్ చక్రవర్తి, మహేంద్ర సింగ్, మల్లు స్వరాజ్యం, గణేష్ శంకర్ విద్యార్థి, విజరుకాంత్ థాకూర్, మనోహర్ సింగ్, బజుబన్ రియన్, ఎస్పి కశ్యాప్, జక్కా వెంకయ్యకు మహాసభ ఘన నివాళి అర్పించింది. గురుదాస్ గుప్తా, ఐజాజ్ అహ్మద్, అశోక్ మిత్రా, ఎస్పి బాల సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులకు నివాళి అర్పించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మరణించిన ప్రముఖులకు, కమ్యూనిస్టు నేతలకు మహాసభ ఘనంగా నివాళి అర్పించింది. త్రిపురలో బిజెపి గూండాలు, కేరళలో ఆర్ఎస్ఎస్, బిజెపి గూండాలు, బెంగాల్లో టిఎంసి గూండాల చేతుల్లో హతమైన అమరవీరులకు మహాసభ సంతాపం తెలిపింది.
</p>










