Nov 09,2023 20:52

పట్టణాలకు వలస వెళ్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి - చిప్పగిరి
జిల్లాలో వలసలు ఆగడం లేదు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవలేదు. పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పనుల్లేక కూలీలూ వలసలు వెళ్తున్నారు. నివారించాల్సిన అధికారులు, పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది మొదటి నుంచీ వర్షాలు సక్రమంగా కురవపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వచ్చిన అరకొర వర్షాలకు ఖరీఫ్‌ సీజన్‌లో అప్పో, సప్పో చేసి రైతులు పంటలను సాగు చేశారు. పంటలు విత్తినప్పటి నుంచి వర్షాలు కురవలేదు. పంటలు ఎండిపోవడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు కుంగిపోతున్నారు. గ్రామాల్లో సాటి రైతుల వద్ద పరువు పోగొట్టుకోకుండా ఉండాలని దసరా పండగ ముగించుకుని పట్టణాల్లో పనులు చేసుకోవడానికి రైతులు, వ్యవసాయ కూలీలు సిద్ధమయ్యారు. మండలంలోని నేమకల్లు, మజరా గ్రామమైన సంగాలకు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు వాహనాలను బాడుగకు తీసుకొని గృహాలకు తాళాలు వేసి వంట సామగ్రి, బట్టలు సర్దుకుని వలస వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మొక్కజొన్న, మిరప, పత్తి పంటలు బాగా ఉన్నాయని, అక్కడ కూలి పనులు చేసుకోవడానికి వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు. 'మేము సాగు చేసిన పంటలన్నీ వర్షాల్లేక ఎండిపోయాయి. వాటి కోసం అప్పులు చేసుకున్నాం. ఆ అప్పులు తీర్చడానికి, మా కడుపులు నింపుకోవడానికి, జీవనం కొనసాగించడానికి వలస వెళ్లక తప్పడం లేదు' అని తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. రైతులు, కూలీలు వలస వెళ్లకుండా ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకపోవడం శోచనీయం. ప్రతేడాది పంటల సాగుకు చేసిన అప్పులే వడ్డీలకు వడ్డీ ఎక్కువై కట్టలేకపోతున్నామని, ఈఏడాదైనా పంటలు బాగా వస్తే అప్పులు తీర్చుదామని రైతులు భావించారు. ఈఏడాది కూడా వర్షాల్లేక, కరువును జయించలేక ఎక్కడికో వెళ్లి బతకాల్సిన దుస్థితి నెలకొంది. ఈ దుర్భర పరిస్థితి తమకు ఎప్పుడు పోతుందోనని వ్యవసాయ కూలీలు వాపోయారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతులు జీవితాలు మారడం లేదు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో మరిన్నీ వలసలు పెరిగే అవకాశం ఉందని గ్రామాల్లోని ప్రజలే చర్చించుకుంటున్నారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతులకు, వ్యవసాయ కూలీలకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు, రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వలసలకు తావు లేకుండా పనులు కల్పిస్తాం
- ఎంపిడిఒ సివి.కొండయ్య

మండలంలో ఏ గ్రామంలోనైనా సరే పంటలు ఎండిపోయి వలసలు పోయే వారికి అదనంగా ఉపాధి పనులను కల్పిస్తాం. ఏ ఒక్కరూ వలసలు వెళ్లడానికి తావు లేకుండా చూసుకుంటాం. ఇప్పటివరకు అధికారికంగా వలసలు మా దృష్టికి రాలేదు.
వలసలు వెళ్లకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది
- కెపి నారాయణ స్వామి, సిపిఎం నాయకులు

వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికి రాక పక్క రాష్ట్రాలకు రైతులందరూ వలస వెళ్లి అక్కడ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ వలసలను ఆపాలంటే తక్షణమే ప్రభుత్వం కరువు మండలాల్లో అదనపు ఉపాధి పనులు కల్పించి, వెంటనే వేతనాలు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే వలసలు ఆగుతాయి.