Apr 12,2022 07:54
  • 10 నెలలుగా సిఎఫ్‌ఎంఎస్‌లోనే పెండింగు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అమలు చేయాల్సిన అమృత్‌ నగరాల పనులు నిలిచిపోయాయి. నిధులు లేకపోవడం వల్ల నిర్మాణ సంస్థలు పనులు నిర్వహించలేకపోతున్నాయి. కనీసం కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించే రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రా డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ కూడా చేతులెత్తేస్తోంది. అత్యవసరంగా నిధులు ఇవ్వకపోతే అమృత్‌ పనులను కొనసాగించలేమని ఆ సంస్థ అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు. అమృత్‌ పథకం కింద ఎంపిక చేసిన పట్టణాల్లో ఆస్తుల కల్పనకు అనేక పనులను ప్రతిపాదించారు. వీటికి టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. కొన్ని పనులకు సంబంధించి బిల్లులు కూడా సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు. అయితే పది నెలలుగా ఈ బిల్లులు సిఎఫ్‌ఎంఎస్‌ వద్దనే పెండింగులో ఉండిపోయాయి. ఇవే బిల్లులను వార్షికాంతం పేరుతో ఆర్థికశాఖ రద్దు చేసేసింది. పది నెలలుగా నిధులు రాకపోవడంతో అమృత్‌ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చేసిన పనులకు నిధులు ఇవ్వకపోవడంతో ఇక తాము పనులు చేయలేమంటూ నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులు కూడా నిర్ధారించారు. పనుల కోసం ఆయా నిర్మాణ సంస్థలు నియమించుకున్న కార్మికులు, ఉద్యోగులు కూడా జీతాలు, వేతనాలు లేక పనులకు రావడం లేదని అధికారులు అంటున్నారు. అమృత్‌ పథకం వచ్చే ఏడాది మార్చితో ముగిసిపోతుంది. ఈలోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు పూర్తి చేయడం సాధ్యం కానిదిగా కనిపిస్తోంది. చేసిన పనులకు సంబంధించి మొత్తం రూ.15.85 కోట్ల బిల్లులను రద్దు చేయగా, ఇక ఖాతాలో జీరో బ్యాలెన్స్‌ ఉన్నట్లు ఆర్థికశాఖ చెబుతోంది. ఇంకా రూ.1,249 కోట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వహణశాఖ అధికారులు చెబుతుండటం విశేషం. ఇంత మొత్తం పనులను వచ్చే మార్చిలోగా పూర్తి చేయడం సాధ్యం కాదన్న భావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే కేంద్రానికి ఆ నిధులను వాపసు చేయాల్సి ఉంటుందని వారంటున్నారు. రద్దు చేసిన వాటిల్లో ఏడు సంస్థలకు చెందిన బిల్లులు ఉన్నాయి. వీటిని తక్షణమే విడుదల చేస్తే అమృత్‌ పనులను పునరుద్ధరిస్తామని అధికారులు ఆర్థిక శాఖకు లేఖ రాశారు.