Apr 07,2023 07:46

నరేంద్ర మోడీ పొందిన డిగ్రీలంటూ బిజెపి నేతలు గతంలో ప్రదర్శించిన కాపీలలో రోల్‌ నంబరు గానీ, తండ్రి పేరు గానీ లేదు. అందువలన అవి నకిలీ అని అనేక మంది భావిస్తున్నారు.1978లో డిగ్రీలను చేతిరాత ద్వారా జారీ చేసేవారు. కానీ బిజెపి నేతలు చూపిన వాటిని కంప్యూటర్‌ అక్షరాలతో ప్రచురించినట్లుగా ఉంది. 1994లో ఆ అక్షరాలకు మైక్రోసాఫ్ట్‌ పేటెంట్‌ హక్కు పొందింది. అలాంటిది 1978 డిగ్రీలో ఎలా ముద్రించారన్నది ప్రశ్న.

రేంద్ర మోడీ రెండు డిగ్రీల వివాదం గురించి మీడియాలో, రాజకీయ నేతల ప్రకటనల్లో చర్చ జరుగు తోంది. అసలు వివాదం ఏమిటి? నరేంద్ర మోడీ చిన్నతనంలోనే టీ అమ్ముతూ తండ్రికి తోడ్పడినట్లు చెప్పారు గనుక చదువుకోలేదు. అనేక మంది కాలేజీకి వెళ్లకుండానే దూర విద్య ద్వారా పరీక్షలు రాసి డిగ్రీలు పొందారు. వారిలో తాను ఒకరిని అని మోడీ చెప్పారు. ఢిల్లీ సి.ఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన డిగ్రీల మీద అనుమానం వచ్చింది. అదేమీ నేరం కాదు. సమాచార హక్కు చట్టం కింద మోడీ గారు ఢిల్లీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీలకు సంబంధించి ఏ రోల్‌ నంబరు, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిందీ వివరాలు కావాలని అడిగారు. కేంద్ర సమాచార కమిషన్‌ దానికి స్పందించి ఆ వివరాలు సమర్పించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరింది. తద్వారా జనాలకు వాటి గురించి తెలుసుకోవటానికి సాయపడుతుందని కూడా పేర్కొన్నది. కేజ్రీవాల్‌ మాదిరే అనేక మంది సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు అడిగితే ప్రధాని కార్యాలయం, విశ్వవిద్యాలయాలు కూడా తిరస్కరించాయి. నరేంద్ర మోడీ డిగ్రీలు దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కనుక వాటిని వెల్లడించకూడదని చెప్పి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు. అలాంటి అంశాలకు సమాచార హక్కు చట్టం వర్తించదు. తన ఎన్నికల అఫిడవిట్‌లో నరేంద్ర మోడీ తాను దూరవిద్య ద్వారా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి 1983లో ఎం.ఎ పట్టా పొందినట్లు పేర్కొన్నారు. కనుక అవి దేశ రహస్యాలు కాదు.
          ఫలానా పదవికి ఫలానా విద్యార్హత ఉండాలని రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో గానీ నిర్దేశించలేదు కదా మరి మోడీ డిగ్రీల గురించి ఇంత రచ్చ ఎందుకు అని సందేహం రావచ్చు. నాది వానాకాలం చదువు అని మోడీ రాసి ఉంటే గొడవ ఉండకపోను. తప్పుడు సమాచారమిచ్చారన్నదే ఆరోపణ. డిగ్రీ ఉంటే చూపాలి, లేకుంటే ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు గనుక అది అనర్హత కిందికి వస్తుంది. మోడీ గుజరాత్‌ అసెంబ్లీకి పోటీ చేసినపుడు తాను అవివాహితుడనని అఫిడవిట్లలో పేర్కొన్నారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికలపుడు తాను యశోదాబెన్‌ అనే ఆమెను వివాహం చేసుకున్నట్లు రాశారు. వివాహం గురించే నిజాలు దాచారు గనుక డిగ్రీల గురించి కూడా అనుమానం తలెత్తింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక దరఖాస్తుకు ''ప్రధాని విద్యార్హతల వివరాలు ప్రధాని కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మీ ప్రధాని గురించి తెలుసుకోండి అన్నీ దానిలో దొరుకుతాయి. కోరిన సమాచారం కావాలంటే ఎన్నికల కమిషన్‌ను అడగండి'' అని సమాధానం చెప్పింది ప్రధాని కార్యాలయం. దానికి ఇ.సి ఏం చెప్పిందంటే ఈ సమాచారం తమ దగ్గర లేదని, సిసిఐ.ఎన్‌ఐసి.ఇన్‌లో అభ్యర్ధుల అఫిడవిట్లు అన్న విభాగంలో చూడవచ్చని పేర్కొన్నది. మోడీ ఎం.ఎ డిగ్రీ గురించి సమాచారం అడిగితే గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఒక్క ముక్కలో ''ఆర్‌టిఐ చట్టం 2005 ప్రకారం ఈ సమాచారాన్ని బహిర్గత పరచకూడదు'' అని జవాబిచ్చింది.
         మోడీ డిగ్రీల వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదంటూ కమిషన్‌ అప్పిలేట్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. దాన్ని విచారించిన కమిటీ ఏం చెప్పిందంటే ''ప్రజా సంబంధ అధికార వ్యవస్థ తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆఫీసు రికార్డులో లేనిదాన్ని ఇవ్వలేరు. ప్రధాని కార్యాలయం కూడా అదే వివరాలను ఇవ్వాలనటం సరైంది కాదు.సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(జె) ప్రకారం ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయ విడుదల చేయనవసరం లేదు. ప్రధాన మంత్రి కావటానికి కనీస అర్హతలను నిర్వచించలేదు గనుక మోడీ డిగ్రీల గురించిన వివరాలను ప్రధాని కార్యాలయం కలిగి ఉండాల్సిన అవసరం లేదు'' అని పేర్కొన్నది. అడిగిన సమాచారం సాధారణంగా ఉందని, రోల్‌ నంబరు లేకుండా తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ఢిల్లీ విశ్వవిద్యాలయం చేసిన వాదనను అంగీకరించింది. ఈ పరిణామం తరువాత అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులకు లేఖ రాశారు. దాన్నే సమాచార హక్కు దరఖాస్తుగా పరిగణించి నరేంద్ర మోడీ డిగ్రీల రోల్‌ నంబర్లు అందచేస్తే వివరాలను తెలుసుకో వచ్చునంటూ ప్రధాని కార్యాలయాన్ని శ్రీధర్‌ కోరారు.
         రెండు విశ్వ విద్యాలయాలు కూడా నరేంద్ర మోడీకి ఎలాంటి డిగ్రీలు ఇవ్వలేదని చెబితే ఏమౌతుంది? ప్రస్తుతం ఉన్న శిక్షాస్మృతి లోని సెక్షన్‌ 191 ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వటం నేరపూరితమైన తప్పిదం. దానికి శిక్ష ఏమిటో స్పష్టంగా లేదు. ప్రజాస్వామిక సంస్కరణల కోసం పని చేసే సంస్థ (ఏడిఆర్‌) 1999లో వేసిన ప్రజాప్రయోజన దావా, తరువాత కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ నేర, ఆర్థిక, విద్యకు సంబంధించిన వివరాలను నామినేషన్‌ పత్రాల్లో విధిగా సమర్పించాలి. వాటిలో అక్రమాలుంటే నేరపూరితం అవుతుంది. ఈ వివరాలు వాస్తవమా కాదా అన్నది ఎన్నికల కమిషన్‌ విచారించదు, తప్పని తేలినా శిక్షించే అధికారం దానికి లేదు. అందుకే కోర్టులకు వెళుతున్నారు. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను ఇంటిలిజెన్సీ సంస్థల ద్వారా తనిఖీ చేయించవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. అలా చేయ కూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. స్వల్పకాలంలో తనిఖీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ కూడా పేర్కొన్నది. తరువాత కనీసం గెలిచిన వారి వివరాలను ఆరు నెలల్లో తనిఖీ చేయించాలని ఏడిఆర్‌ కోరినా ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవటం లేదు, అఫిడవిట్లన్నీ ఆదాయపన్ను శాఖకు పంపుతున్నామని మాత్రమే చెప్పింది, ఐటి శాఖ చేస్తున్నదేమీ లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన వివాహ స్థితి గురించి నరేంద్రమోడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ సునీల్‌ సరవాగి దాఖలు చేసిన పిటీషన్‌పై 2013లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్‌ కోరిన వివరాలను ఇవ్వని వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నది. దాంతో విధిలేక నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో తనకు యశోదాబెన్‌తో వివాహం జరిగినట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనవలసి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరు సంఘపరివార్‌ అని చెప్పుకొనే వారు కూడా కోర్టు ఆదేశిస్తే తప్ప నిజాలు చెప్పరన్నమాట !
           ప్రజాస్వామిక వ్యవస్థలను పటిష్ట పరుస్తామని చెప్పుకొనే బిజెపి, కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ చేసిన ఒక చక్కటి సిఫార్సును పక్కన పడేశాయి. తప్పుడు అఫిడవిట్లు ఇస్తే అనర్హత వేటు వేయాలని, ఇప్పుడున్న ఆరు నెలల శిక్షను రెండు సంవత్సరాలకు పెంచాలని, ఈ కేసులను రోజు వారీ విచారించాలని, నామినేషన్ల దాఖలు ఆఖరి గడువుకు తనిఖీకి వారం రోజుల వ్యవధి ఉంటే ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే వాటి మీద అభ్యంతరాలు దాఖలు చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుందని చెప్పింది. కానీ గత తొమ్మిదేళ్లుగా మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు, అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపించటం లేదు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ డిగ్రీల గురించి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది, అనేక అనుమానాలకు తెరలేపింది. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశానికి సంబంధించిన ఉదంతంలో నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలను అందచేయాలని గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని ఢిల్లీ సి.ఎం కేజ్రీవాల్‌ కోరటం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేగాక కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది. దీని మీద కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. మోడీ డిగ్రీల మీద అనుమానాలను పెంచిందన్నారు. తమ సంస్థలలో మోడీ డిగ్రీలు పొందినందుకు పండగ చేసుకోవాల్సిన గుజరాత్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని దాచేందుకు చూస్తున్నాయన్నారు.
          నరేంద్ర మోడీ పొందిన డిగ్రీలంటూ బిజెపి నేతలు గతంలో ప్రదర్శించిన కాపీలలో రోల్‌ నంబరు గానీ, తండ్రి పేరు గానీ లేదు. అందువలన అవి నకిలీ అని అనేక మంది భావిస్తున్నారు.1978లో డిగ్రీలను చేతిరాత ద్వారా జారీ చేసేవారు. కానీ బిజెపి నేతలు చూపిన వాటిని కంప్యూటర్‌ అక్షరాలతో ప్రచురించినట్లుగా ఉంది. 1994లో ఆ అక్షరాలకు మైక్రోసాఫ్ట్‌ పేటెంట్‌ హక్కు పొందింది. అలాంటిది 1978 డిగ్రీలో ఎలా ముద్రించారన్నది ప్రశ్న. అవీ తప్పుల తడకలు. ఎం.ఎ మొదటి భాగంలో నరేంద్ర కుమార్‌ దామోదరదాస్‌ మోడీ అని ఉంటే రెండవ భాగంలో నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అని ఉంది.
          ఇంత రచ్చ జరుగుతున్నా నరేంద్ర మోడీ నోరు మెదపటం లేదు. అనేక మంది మోడీ భక్తులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. మోడీ వాస్తవాలు చెప్పి విమర్శకుల నోళ్లు ఎందుకు మూయించటం లేదని వారిలో వారు మదనపడుతున్నారు. కోర్టులు, నిబంధనలు ఎలా ఉన్నా నైతిక బాధ్యతగా ఎందుకు వెల్లడించరు, ఎందుకు పిరికిబారుతున్నారు అన్నది ప్రశ్న.

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు