Oct 18,2023 15:01

తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను జనవరి నెలలో నిర్వహించుకోవాలని వేచి చూస్తున్న యాత్రికులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి 20వ తేదీ ఉదయం 9.59 గంటల వరకు ఈ ఆర్జిత సేవల కోసం తమ పేర్లను ఆధార్‌ నంబర్‌ సాయంతో బుక్‌ చేసుకోవచ్చు. టీటీ దేవస్థానమ్స్‌ యాప్‌ నుంచి కానీ, టీటీడీ అధికారిక బుకింగ్‌ పోర్టల్‌ నుంచి కానీ బుక్‌ చేసుకోవచ్చు.
లక్కీ డీప్‌ లో ఎంపికైన యాత్రికులకు 20వ తేదీ సమాచారం వస్తుంది. ఎంపికైన యాత్రికులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫీజు చెల్లించి ఖరారు చేసుకోవాలి. ఇక జనవరి నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మౌత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవల కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చు. ఇవే సేవలకు ఆన్‌ లైన్‌ లో వర్చువల్‌ గా పాల్గనే వారికి సంబంధించి స్లాట్లను 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
జనవరి నెలలో అంగప్రదక్షిణ కోటా టోకెన్‌ లను ఈ నెల 23వ తేదీ ఉదయం 20 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక జనవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వఅద్ధులు, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లను 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చు. తిరుమల, తిరుపతి అకామడేషన్‌ బుకింగ్‌ ఈ నెల 25 లేదా 26వ తేదీల్లో ఉంటుంది.