వెస్టిండీస్ టూర్కి ప్రకటించిన జట్టులో ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కకపోవడంతో మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. ''వెస్టిండీస్ టూర్కి ప్రకటించిన జట్టులో ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. టీమిండియాకి అతను కీ ప్లేయర్, వెన్నెముక లాంటోడు... పూజారాని తప్పిస్తే ఆ ప్రభావం టీమ్పై తీవ్రంగా పడుతుంది. వెన్నెముక లేకుండా మిగిలిన ఎముకల గూడు ఎలా నిలబడుతుంది. బెంచ్ మార్కు దాటకపోతే ఎంత పెద్ద ప్లేయర్ని అయినా తప్పించాల్సిందే. అది కెప్టెన్ రోహిత్ శర్మ అయినా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా అప్పుడే మిగిలిన ప్లేయర్లకు బాగా ఆడాలనే బాధ్యత, భయం పెరుగుతాయి.. ఛతేశ్వర్ పూజారాకి ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చి ఉంటారు కానీ పూర్తిగా తప్పించి ఉండరనే అనుకుంటున్నా..'' అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.










