Jun 30,2023 21:10

న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో అత్యంత కీలకమైన ఎనిమిది రంగాల వృద్థి మందగించింది. ముడి చమురు, సహజ వాయువు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి తగ్గడంతో ప్రస్తుత ఏడాది మేలో కీలక రంగాల వృద్థి 4.3 శాతానికి పరిమితమై.. ఆరు మాసాల కనిష్టాయికి పడిపోయింది. 2022 మేలో ఈ రంగాలు రికార్డ్‌ స్థాయిలో 19.3 శాతం పెరుగుదలను సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మేతో కాలంలో ఎనిమిది కీలక రంగాల వృద్థి 4.3 శాతానికి పడిపోగా.. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ రంగాలు ఏకంగా 14.3 శాతం వృద్థిని కనబర్చాయి. గడిచిన మేలో సిమెంట్‌, ఎరువులు, స్టీల్‌, రిఫైనరీ ఉత్పత్తులు వరుసగా వృద్ధిని నమోదు చేశాయి. 2022 మేతో పోల్చితే గడిచిన మే మాసంలో బగ్గు ఉత్పత్తిలో 7.2 శాతం, ఎరువులు, స్టీల్‌, సిమెంట్‌, పెట్రోలియం ఉత్పత్తులు వరుసగా 9.7 శాతం, 9.2 శాతం, 15.5 శాతం, 2.8 శాతం చొప్పున వృద్ధిని కనబర్చాయి. మరోవైపు ముడి చమరు, సహజ వాయువు ఉత్పత్తి వరుసగా 1.9 శాతం, 0.3 శాతానికి పడిపోయింది. విద్యుత్‌ రంగం కూడా 0.3 శాతానికి దిగజారింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాలు ఏకంగా 40.27 శాతం వాటాను కలిగి ఉన్నాయి.