Jun 09,2023 07:37

అసలైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో మతాల్ని, మత సంబంధమైన పూజా కార్యక్రమాల్ని పక్కనపెట్టి, వాటికి అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని అతిక్రమించింది. రాజదండం తన చేతికి వచ్చింది గనుక, తనకు పట్టాభిషేకం జరిగిందనీ... ఇక అధికారమంతా తనదే అని ప్రధాని భావిస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు నెహ్రూ చేతిలో ఉన్న రాజదండం ఈ రోజు తన చేతిలోకొచ్చిందని సంబరపడుతూ ఉండొచ్చు. అసలు విషయమేమంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజదండానికి గానీ, రాచరికానికి గాని ఎలాంటి విలువా లేదు, ఉండదు !

అన్ని విషయాలలో వివాదాస్పదం అవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోంమంత్రి విలేకరులకు రాజదండం విషయం వెల్లడించారు. ఎవరికీ తెలియని ఒక అప్రధానమైన రాజదండాన్ని ఎందుకు తెరమీదికి తెచ్చారూ? అంటే... నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ వివాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి! నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని శంకుస్థాపన చేసినప్పుడే దేశం భగ్గుమంది. అశోక చక్రంపై నిర్మించిన కొత్త సింహాలు రౌద్రంగా వున్నాయన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ భవన ప్రారంభోత్సవం కూడా ఆయనే చేయడం వల్ల విపక్షాలే కాదు, దేశ ప్రజలు సైతం కినుక వహించారు. ఎందుకంటే పార్లమెంటు వ్యవస్థలో మొదటిస్థానం దేశాధ్యక్షులది. తర్వాత రాజ్యసభది. ఆ తర్వాత లోక్‌సభది. ఆ వరుస క్రమంలో లోక్‌సభ నాయకుడిగా ప్రధానిది మూడో స్థానం. మొదటి వారిని వదిలేసి, మూడో స్థానంలో ఉన్నవారు ప్రారంభించడం ఏమిటని విపక్షాలు నిరసన తెలియజేశాయి. మొత్తానికి మొత్తంగా కార్యక్రమాన్నే బహిష్కరించాయి.
             దేశాధ్యక్షులంటే సుప్రీం కమాండర్‌ ఆఫ్‌ ద ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌-సైన్యాధినేత ఎవరో వారే దేశాధినేత అవుతారు. పార్లమెంటులో ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించేది కూడా దేశాధ్యక్షులే. ఇక్కడ లింగ బేధం ఉండదు. అధ్యక్ష స్థానంలో ఉన్నది గిరిజన మహిళనా? భర్త లేని మహిళనా? అని చూడగూడదు. మత మౌఢ్య వ్యవస్థలో మాత్రమే అధ్యక్షులవారిది ఏ కులం? ఏ మతం? భర్త లేదా భార్య జీవించి ఉన్నారా లేదా? అనేవి చూసుకుంటారేమోగానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని పక్కన పెట్టాల్సిందే! భారత రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని ప్రతిష్టించాలని కలలు కంటున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌-బిజెపి వారి విధానాలు ఈ విధంగా అస్తవ్యస్తంగానే ఉంటాయి. మనువాదులు ఏర్పరిచిన నిచ్చెనమెట్ల కుల సంస్కృతి ప్రకారం ప్రస్తుత ప్రధాని అగ్రవర్ణంవాడు కాదు. పూజలకు అతను ఎలా పనికొచ్చాడూ? పైగా హిందూ ధర్మం ప్రకారం ఏ పూజలైనా సతీసమేతంగా చేయాలి. మరి ఈ ప్రధాని అలా చేయలేదు కదా? వారి ధర్మం ప్రకారం ఒంటిగా చేసిన పూజలు, సాష్టాంగ ప్రమాణాలు అన్నీ మంచి ఫలితాలనిస్తాయా? ఇవి సామాన్యుల అనుమానాలు.
           మనది ప్రజాస్వామ్య దేశం గనుక, అన్ని మతాలకూ సమానమైన విలువ నివ్వాలి. అలాంటప్పుడు ఏ ఒక్క మతానుసారం హోమాలు, పూజలు ఎలా నిర్వహిస్తారూ? ఛార్టెడ్‌ ప్లేన్‌ పంపి తమిళనాడులోని ఆధీనం మఠానికి చెందిన సాధువులను ఢిల్లీకి పిలిపించుకున్నారు కదా? మరి ఇతర మతాల ప్రతినిధుల్ని నామమాత్రంగానైనా పిలవలేదే? అసలైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో మతాల్ని, మత సంబంధమైన పూజా కార్యక్రమాల్ని పక్కనపెట్టి, వాటికి అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని అతిక్రమించింది. రాజదండం తన చేతికి వచ్చింది గనుక, తనకు పట్టాభిషేకం జరిగిందనీ... ఇక అధికారమంతా తనదే అని ప్రధాని భావిస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు నెహ్రూ చేతిలో ఉన్న రాజదండం ఈ రోజు తన చేతిలోకొచ్చిందని సంబరపడుతూ ఉండొచ్చు. అసలు విషయమేమంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజదండానికి గానీ, రాచరికానికి గాని ఎలాంటి విలువా లేదు, ఉండదు! చాలా శ్రద్ధగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అలహాబాదు మ్యూజియంలో అప్పుడు పనిచేసిన క్యురేటర్‌ ఓంకార్‌ ఆనందరావు వాంఖ్‌డే చెప్పిన దాని ప్రకారం అది ''పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు బహుమతిగా వచ్చిన ఒక బంగారు చేతికర్ర'' మాత్రమే. నెహ్రూ తన వస్తువుల్ని మ్యూజియంకు బహూకరించినప్పటి నుండి అంటే 1952 నుండి అది అక్కడే అలహాబాదు మ్యూజియంలో ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆధీనం మఠం వారిచ్చిన రాజదండానికి ప్రతిరూపం. ఒరిజనల్‌ రాజదండం, ఢిల్లీ నేషనల్‌ మ్యూజియంలో ఉంది. నెహ్రూజీ దాన్ని తన స్వంత ఆస్తిగా దాచుకున్నాడని అధికార పార్టీవారు చెప్పడం అబద్ధం. ఎందుకంటే ఆ ఒరిజినల్‌ రాజదండాన్నే ఢిల్లీ మ్యూజియం నుండి తెప్పించి మోడీగారు పూజలు చేసి కొత్త పార్లమెంట్‌లో ప్రతిష్టించారు.
         ఏది ఏమైనా ప్రొఫెసర్‌ మాధవన్‌ కె. పలట్‌ చెప్పిన విషయం ఈ దేశ ప్రజలు నమ్మి తీరాలి. ఆయన చరిత్ర పరిశోధకుడు మాత్రమే కాక, ఎంపిక చేసిన నెహ్రూ రచనలకు (సెలెక్టెడ్‌ వర్క్స్‌ ఆఫ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ) సంపాదకుడు.
          అంతే కాదు, నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌కు ట్రస్టీ కూడా! ''రాజదండం మౌంట్‌బాటన్‌కు అందించి, మళ్ళీ తీసుకొచ్చి నెహ్రూకు ఇచ్చారనడం శుద్ధ అబద్ధం! అందుకు ఏ ఆధారమూ లేదు'' అని ప్రొఫెసర్‌ మాధవన్‌ కె. పలట్‌ కొట్టిపడేశారు. ఇవన్నీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ అల్లిన తప్పుడు కథలని ఆయన కరణ్‌ థాపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. అలహాబాదులోని ఆనంద నిలయం నెహ్రూ కుటుంబీకుల స్వంత ఆస్తి. కాలక్రమంలో అది మ్యూజియం అయ్యింది. నెహ్రూ వస్తువులు, వచ్చిన బహుమతులు అన్నీ అందులో భద్రపరిచారు. ఇందిరా గాంధీ వచ్చాక ఆనంద నిలయాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుండి అది పబ్లిక్‌ ప్రాపర్టీ అయ్యింది. నేటి ప్రభుత్వ పెద్దలు నెహ్రూ విలువను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టే... ఈ విషయంలో కూడా చేశారు. నెహ్రూ కావాలని తన ఆధీనంలో ఉంచుకున్నాడనీ, తన చేతికర్ర అని చెప్పుకున్నాడనీ అభాండాలు వేస్తున్నారు.
             అధికార మార్పిడికి చిహ్నంగా రాజదండాన్ని నెహ్రూ స్వీకరించలేదు. అధికార మార్పిడి అంటే బ్రిటిష్‌ రాజు ఛార్లెస్‌-6 నుండి నాటి తొలి భారత రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ల మధ్య జరగాలి. కానీ జరగలేదు. ప్రజాస్వామ్యంలో దేశాధ్యక్షుడే దేశానికి అధిపతి. ప్రధాని కాదు. అది నెహ్రూ సమయంలోనైనా లేక ఇప్పుడు మోడీ సమయంలోనైనా పద్ధతి పద్ధతే. అలా జరగనప్పుడు దానికి ఏ విలువా ఉండదు. కాంగ్రెస్‌ నుండి తాము అధికారం హస్తగతం చేసుకున్నామని ఆర్‌ఎస్‌ఎస్‌ - బిజెపి లు సంబరాలు చేసుకుంటే చేసుకోవచ్చు. నూతన పార్లమెంట్‌ భవనంలో హోమాలు, పూజలు, సాష్టాంగ ప్రమాణాలూ చేసి మనువాదం పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటే చాటుకోవచ్చు. అవన్నీ ఈ దేశ ప్రజల దృష్టిలో అప్రజాస్వామికమైనవి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరిపించడాన్ని అసలు ఎవరూ హర్షించరు.
              తిరువదుతిరై ఆధీనం మఠంవారు 14 ఆగస్టు 1947న నెహ్రూజీకి రాజదండం బహూకరించినప్పుడు ఇందిరాగాంధీ, పద్మజా నాయుడు ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఒకవేళ అది అధికార మార్పిడికి చిహ్నం - అని అనుకుని ఉంటే, వారు ఎన్నో చోట్ల, ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడేవారు, రాసేవారు. వారు ఆ పని చేయలేదు. చరిత్రకారులెవరూ ఆ సంఘటనకు ప్రాధాన్యమివ్వలేదు. అదీగాక సి.రాజగోపాలాచారి (రాజాజీ) మనవడు రాజమోహన్‌ గాంధీ ఎప్పుడూ ఎక్కడా రాజదండం గురించి రాయలేదు. ఎందుకంటే ఆయన రాజాజీ మనవడు మాత్రమే కాదు. ప్రసిద్ధ చరిత్రకారుడు. అంత ప్రాముఖ్యమున్న విషయమైతే ఆయన ఆ విషయాన్ని ఎందుకు వదిలేస్తారూ? గోపాల్‌కృష్ణ గాంధీ అయితే అసలు ఆ విషయమే తనకు తెలియదన్నారు. ఈ సోదరులు పార్లమెంట్‌ వ్యవస్థలో ఉన్నవారు. ఇటు రాజాజీ అటు గాంధీజీ కుటుంబాలకు చెందినవారు. వారెందుకు అధికార మార్పిడికి చిహ్నం అయిన రాజదండం ప్రసక్తి ఎక్కడా తీసుకురాలేదూ? అంటే ఇది నేటి కేంద్ర హోం మంత్రి వండి వార్చిన అబద్ధాల వంటకం అని తేలిపోయింది. ఈ వాస్తవాలన్నీ తెలిశాక కేంద్ర హోంమంత్రి మాటల్లో నిజమెంతో తేటతెల్లమయ్యింది.
1. అలహాబాదు మ్యూజియంలో ఉన్నది ఒరిజనల్‌ రాజదండం కాదు. దాని ప్రతిరూపం మాత్రమే! ఒరిజినల్‌ రాజదండం ఢిల్లీ నేషనల్‌ మ్యూజియంలో ఉంది. దాన్ని నెహ్రూ తన స్వంత ఆస్తిగా దాచిపెట్టుకోలేదు. 2. అది తన బంగారు చేతికర్ర అని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. 3. అధికార మార్పిడి జరిగినప్పుడు స్వీకరించింది అని చెప్పడానికి వీలే లేదు. నెహ్రూజీకి అందిన ఎన్నో బహుమతులలో ఇది ఒకటి! 4. ఇప్పుడు అధికారం ఎవరి నుండి ఎవరికి మారిందనీ? బిజెపి-మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా అధికారంలోనే ఉంది. ఇదంతా వృధా ప్రయాస. 5. పెరిగిన ధరలు, నిరుద్యోగం, బ్యాంకు దోపిడీగాళ్ళు, ప్రైవేటుకు పెద్దపీట, మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి, పతనమైన రూపాయి విలువ, ఆకలి సూచీలో అట్టడుగు స్థానం, కనీవినీ ఎరుగని రైలు ప్రమాదాలు వంటి ఎన్నెన్నో అంశాల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చడానికి - మ్యూజియంలో ఓ మూలపడి ఉన్న వస్తువును తెచ్చి ఈ ప్రభుత్వ పెద్దలు సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. 6. గత ప్రభుత్వం ఏం చేసిందని మాటి మాటికి ప్రశ్నించే ఈ దేశ ప్రధాని ఇదిగో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి చూపుతున్నారు.
          ఆగస్టు 14, 1947 సాయంత్రం, గవర్నర్‌ జనరల్‌, చివరి వైస్రారు అయిన మౌంట్‌బాటన్‌ - కరాచి నుండి ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగాడు. ఆయన అప్పుడే పాకిస్తాన్‌ నుండి తిరిగివచ్చాడు. ఎందుకంటే, ఆ దేశానికి కూడా స్వాతంత్య్రం వచ్చింది ఆ రోజే. మళ్ళీ ఆ రోజు రాత్రి ఢిల్లీ పార్లమెంటులో ఉండాలి. అక్కడ రాత్రి 11.30కు నెహ్రూజీ తొలిసారి ప్రసంగించబోతున్నారు. అంతటి ముఖ్యమైన కార్యక్రమాల మధ్య ఆధీనం మఠంవారు మౌంట్‌ బాటన్‌ను కలిసి రాజదండం ఇచ్చారనడం వంద శాతం అబద్ధం. వైస్రారు అంటే మామూలు విషయం కాదు. ఏ నిముషానికి ఎవరు వచ్చి వెళ్ళారన్నది అంతా రికార్డు ఉంటుంది. ఆ సాయంత్రం తమిళనాడు మఠాధిపతులు మౌంట్‌ బాటన్‌ దగ్గరికి వచ్చిన రికార్డేది లేదు. అదంతా ఇప్పటి ఈ హోంమంత్రి సృష్టించిన రికార్డు! అంతా గమనిస్తే, మరొక విషయం తోస్తుంది. అబద్ధాలతోనైనా...ఏదో విధంగా తమిళనాడులో నేటి స్టాలిన్‌ ప్రభుత్వాన్ని కదిలించాలన్న పథకాలు సిద్ధమవుతున్నాయేమో !
           చివరగా ఇంకా ఒక ఆధారం ఉంది. డొమినిక్యు లిపిరి; లార్రి కొల్లిన్స్‌ కలిసి ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ మీద 'ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌' అనే ఒక పెద్ద గ్రంథం రచించారు. అందులో అసలు రాజదండం ప్రసక్తే లేదు. అధికార మార్పిడికి రాజదండం చిహ్నమైతే, ఆ రచయితలు దాని గురించి తప్పక రాసి ఉండేవారు కదా? 10-12 శతాబ్దాల నాటి చోళ రాజుల రాజదండాన్ని తవ్వి తీసి ఈ 21వ శతాబ్దానికి తీసుకొచ్చారంటే ఏమనుకోవాలి? ఈ రాజదండం-నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఒక 'సర్జికల్‌ స్ట్రైక్‌' అనుకోవాల్సి ఉంటుంది.

/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,
జీవశాస్త్రవేత్త
/
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు