Mar 31,2023 07:28

ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47 మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేకపోవడం...ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చుకుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది.

మోడీ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌) గొంతు నులిమేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్థిక వ్యవస్థ మరింత 'సమర్ధవంతంగా', 'ఉత్పాదకంగా' పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలంటే ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని, అందుకుగాను ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టాలని నయా ఉదారవాద సిద్ధాంతం పేర్కొంటున్నది. దీనికి కట్టుబడిన మోడీ ప్రభుత్వం క్రమం తప్పకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా వివిధ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పెడుతూ వస్తోంది. అంతేకాకుండా పథకాల గొంతు నులిమేందుకు ఇతర మోసపూరిత చర్యలను కూడా చేపడుతోంది.
     ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ విషయానికి వస్తే, 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయింపులు జరపాలని ప్రతిపాదించబడింది. కానీ, వాస్తవానికి రూ.89,400 కోట్లు ఖర్చు చేసి వుంటారని అంచనా. అంతకు ముందు సంవత్సరం 2021-22లో ఖర్చు పెట్టిన రూ.98,467.85 కోట్లలో దాదాపు పది శాతం తక్కువ. అయితే 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 33 శాతం కోత పెట్టారు.
    ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులు తగ్గించడం ఒక్కటే కాదు. పలురకాల కొర్రీలు పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో, ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు తప్పనిసరిగా అటెండెన్స్‌ (హాజరు) నమోదు చేయాలంటూ నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌.ఎం.ఎం.ఎస్‌) పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కార్మికులు తమ హాజరును నమోదు చేయడం కోసమే గంటల తరబడి ప్రయాస పడాల్సి వస్తోంది. హాజరు పడకపోతే, ఆ రోజుకు వారి వేతనం నష్టపోతారు కాబట్టి ఇది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. పథకంలో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనడానికంటూ ఈ తరహా హైటెక్‌ చర్యలను కార్మికులపై బలవంతంగా రుద్దడం ప్రభుత్వ కుట్ర మినహా మరొకటి కాదు. పిడిఎస్‌ పంపిణీలో కూడా గతంలో ఇదే పద్ధతిని రుద్దారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ల హాజరు విషయంలోనూ ఇలాగే చేశారు.
        వీటన్నిటివల్లా ప్రజలకు గందరగోళ, విచారకర పర్యవసానాలే కలుగుతున్నాయి. కనెక్టివిటీ సమస్యలతో పాటుగా ఆధార్‌ సరిపోలడం లేదని, బ్యాంక్‌ ఖాతా నెంబరు కలవడం లేదని, చేతి వేళ్ళ గుర్తులు పడడం లేదని, ఇంకా ఇలాగే అనేక సమస్యల కారణంగా పిడిఎస్‌ రేషన్‌ వేలాది మందికి అందకుండా పోయింది. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నిబంధనల కారణంగా కార్మికులు పని కోసం ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ ను ఆశ్రయించడం తగ్గిపోతున్నది.
       వేతనాల్లో నిరంతరం జరుగుతున్న జాప్యం కార్మికులకు ఎదురవుతున్న మరో సమస్య. ఒకోసారి అనుమతించిన 15 రోజుల వెసులుబాటును కూడా మించి జాప్యం జరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 15 అంతకుమించి రోజుల జాప్యం తర్వాత రూ.3630 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.1010 కోట్ల వేతనాలు పెండింగ్‌లో వున్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంటోంది. చాలా తక్కువ కూలికి పనిచేసే కార్మికులకు ఈ స్థాయిలో ఇలా వేతనాలు పెండింగ్‌లో పెట్టడమనేది ఏ మాత్రమూ సహించరాని విషయం. దీంతో వారు తరచుగా తక్షణమే డబ్బులు చేతికి అందివచ్చే పనులను ఎంచుకుంటున్నారు. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాల కన్నా తక్కువే వచ్చినా వారు దానికే మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను 2 నుండి 10 శాతం మధ్య పెంచుతున్నట్లు చాలా అట్టహాసంగా ప్రకటించింది. అంటే రోజుకు రూ.7 నుండి రూ. 26 వరకు పెరుగుతాయి. గత అనేక మాసాలుగా ద్రవ్యోల్బణం 6-8 శాతం మధ్యలో వుంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా 8-10 శాతం మధ్య వుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అధిక ద్రవ్యోల్బణం తగ్గుతుందని విశ్వసించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఇక కార్మికుల వేతనాల పెంపు అమలు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరం నుండే. వాస్తవానికి, వ్యవసాయ కార్మికులకు అలాగే వ్యవసాయేతర కార్మికులకు ప్రస్తుతమున్న వేతనాల రేట్ల కన్నా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాలు చాలా తక్కువగా వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ పనులకు సంబంధించి సగటు దినసరి వేతనం కేవలం రూ.217.87. అదే సమయంలో పురుష వ్యవసాయ కార్మికులకు రూ.349.77 అని ఆర్‌బిఐ పేర్కొంది.
        అలాగే ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47 మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేకపోవడం...ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చుకుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది.
          అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పని దొరికిన వారు 8.6 కోట్ల మంది వుండగా, గతేడాది ఈ సంఖ్య 10.6 కోట్లుగా వుంది. అంటే గతేడాది కన్నా 2 కోట్లు (దాదాపు 20 శాతం) తగ్గింది. పైగా ఈ పథకంలో పని కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 1.6 కోట్ల మంది కార్మికులు తర్వాత పని లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. అలాంటి వారిని పరిగణన లోకి తీసుకోకుండా వేసిన లెక్క ఇది.
తక్కువ వేతనాలు, సరిపడా పని దినాలు లేకపోయినా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ అనేది కోట్లాదిమంది కుటుంబాలకు జీవనాధారంగా వుంది. ఈ పథకంలో ఇచ్చేది అతి తక్కువ వేతనాలే అయినప్పటికీ అవే వారికి ఎంతో విలువైనవి. ఎందుకంటే దేశంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పైగా పెరుగుతున్న ధరలు కుటుంబాల బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభమనేది ఎడతెగకుండా వుంది. వేతనాలు, పని దినాలు పెంచుతూ, పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది. దీనితో పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటంగా మారిన ఆటకు అంతం పలకాలి.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)