Feb 02,2023 21:20

న్యూఢిల్లీ : అదానీ గ్రూపు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నదని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై ఎట్టకేలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. అదానీ కంపెనీలకు అప్పులిచ్చిన వివరాలను తమకు అందజేయాలని బ్యాంక్‌లు, విత్త సంస్థలను ఆర్‌బీఐ ఆదేశించిందని సమాచారం. ఏయే బ్యాంక్‌లు ఎంత మొత్తం చొప్పున రుణాలిచ్చాయో వివరాలు ఇవ్వాలని కోరిందని తెలుస్తోంది. కాగా.. దీనిపై ఆర్‌బీఐ వర్గాలు అధికారికంగా స్పందించడానికి నిరాకరించాయి. విత్త సంస్థల నుంచి అదానీ గ్రూపు రూ.2 లక్షల కోట్ల పైన అప్పులు తీసుకుంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణాలు ఎంత ఉన్నాయే వెల్లడి కావాల్సి ఉంది. అదానీ కంపెనీ షేర్లలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ వేల కోట్ల నష్టాలను చవి చూస్తున్నది. మరోవైపు అదానీ ఎంటర్‌ఫ్రైజెస్‌ రూ.20వేల కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ.. దీనిపై సెబీ ఎలాంటి వివరణ కోరకపోవడం గమనార్హం. స్విస్‌కు చెందిన క్రెడిట్‌ సూస్సె, మరో దిగ్గజ విత్త సంస్థ సిటీ గ్రూపు బ్యాంక్‌ అదానీకి అప్పులిచ్చేది లేదని తేల్చి చెప్పడం విశేషం.