Mar 30,2023 06:50

ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణించే పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర బిజెపి ప్రభుత్వం పూటకోమాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోంది. నిర్మాణ పనులు, నిర్వాసితుల సహాయ, పునరావాసం అడుగు ముందుకు పడని దయనీయ స్థితి ఉండగా, కేంద్రం చేస్తున్న గజిబిజితో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. గడచిన వారం రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దోబూచులాడగా, నిధుల విషయమై తాజాగా విత్త మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారుకు పంపిన లేఖ మరింత అయోమయంలో పడేసింది. పూర్తి చేసిన పనులకుగాను రూ.828 కోట్లు విడుదల చేస్తూ, ఇంకా ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. 2013-14 ధరల ప్రకారం రూ.20 వేల కోట్ల అంచనాకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసింది. సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) మేరకు ఇంకా కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా ఆ ప్రస్తావన చేయలేదు. అంతకుముందు పార్లమెంట్‌లో ఇద్దరు జలశక్తి మంత్రులు ప్రాజెక్టు ఎత్తుపై తలొక మాటా మాట్లాడారు. లోక్‌సభలో మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ జోషి సమాధానమిస్తూ తొలి దశలో ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లేనన్నారు. రాజ్యసభలో మరో మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబు చెబుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎత్తు 45.72 మీటర్లుగా చెప్పుకొచ్చారు. కొత్త డిపిఆర్‌పై దాటవేశారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా సంతరించుకున్న ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దాని బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుంది.
పోలవరాన్ని ఆది నుంచీ కేంద్రం వివాదాస్పదం చేస్తోంది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే భరిస్తాం నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని భీష్మిస్తోంది. ప్రాజెక్టు అంటేనే నిర్వాసితులతో కలిపే ఉంటుంది. కేంద్రం ఈ అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించడం అమానవీయం. ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. అత్యధికులు గిరిజనులే. కాంటూరు లెక్కల్లో శాస్త్రీయత లేదనడానికి మొన్న గోదావరికి వచ్చిన వరదలే ఉదాహరణ. అంచనాలను దాటి ఎక్కువ ప్రాంతాలు కొద్దిపాటి వరదలకే మునిగాయి. పునరావాస కాలనీలు సైతం మునిగాయి. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని తేలిపోయింది. ప్రభుత్వ గణాంకాల బట్టి చూసినా ఇప్పటికి 22 శాతానికే పునరావాసం పూర్తయింది. అదీ అసంపూర్తిగానే. జాతి అభివృద్ధికి తమ సర్వస్వం ధారపోసిన లక్షలాది నిర్వాసితుల పునరావాసాన్ని గాలికొదిలేయడం హేయం.
పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడి నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులడుగుతున్నాం అని చెపుతున్నారంతే. మొన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించగా, కేంద్రం ఇచ్చింది 828 కోట్లు మాత్రమే. కొత్త డిపిఆర్‌ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అత్యవసరంగా రూ.15 వేల కోట్లివ్వండని అడగ్గా, కొత్త డిపిఆర్‌ను బుట్టదాఖలు చేశామని కేంద్రం లేఖ పంపింది. అలాగే 2005 అనంతరం 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదంది. కేంద్రం రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నా గట్టిగా ఒత్తిడి ఎందుకు చేయరో తెలీదు. నిర్వాసితుల పునరావాసంపై తొలిదశ, మలిదశ, అని వక్ర భాష్యాలు చెపుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కారు వంత పాడటం అభ్యంతరకరం. 2017-18 ధరలకనుగుణంగా రాష్ట్రం రూ.55 వేల కోట్లకు కొత్త డిపిఆర్‌ పంపగా సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47 వేల కోట్లకు కుదించింది. నిర్వాసితుల పునరావాసానికే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ భాగాన్ని ఎగ్గొట్టేందుకు కేంద్రం పన్నాగం పన్నుతోంది. రాష్ట్రం గమ్మునుంది. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న అంతర్జాతీయ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎన్నికల వాగ్దానం ప్రకారం రాష్ట్ర సర్కారు నిర్వాసితులకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి.