Feb 28,2023 16:19
  • ఇంగ్లండ్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపు
  • ఫాలోఆన్‌ ఆడి గెలిచిన మూడోజట్టుగా రికార్డు

వెల్లింగ్టన్‌: రెండో టెస్టులో న్యూజిలాండ్‌జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో న్యూజిలాండ్‌ ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. దాంతో, ఫాలో ఆన్‌ ఆడిన తర్వాత మ్యాచ్‌ గెలిచిన మూడో జట్టుగా న్యూజిలాండ్‌ చరిత్రలో నిలిచింది. ఇంగ్లండ్‌ 258పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌ నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 48పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ను కివీస్‌ పేసర్‌ నీల్‌ వాగర్‌ నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన జో రూట్‌(95) ఒక్కడే ప్రతిఘటించాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 256 పరుగులకే ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్లలో వాగర్‌ నాలుగు, సౌథీ మూడు, మ్యాట్‌ హెన్రీ రెండు వికెట్లు తీశారు. శతకంతో మెరిసిన విలియమ్సన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ఈ సిరీస్‌లో అదరగొట్టిన హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. అలాగే రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దాంతో 2017తర్వాత కివీస్‌ గడ్డపై సిరీస్‌ గెలిచిన జట్టుగా రికార్డు తిరగరాయాలనుకున్న ఇంగ్లండ్‌ కల కలగానే మిగిలింది.

  • ఇంగ్లండ్‌ తర్వాత..

రెండో టెస్టులో న్యూజిలాండ్‌ విజయాన్ని మరో అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకుంటే.. మొదటి ఇన్నింగ్స్‌లో 209కే ఆలౌట్‌ అయి ఫాలో ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 483పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లండ్‌ చివరివరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఇంతకుముందు 1894, 1981లలో ఇంగ్లండ్‌, 2001లో భారత జట్లు ఫాలోఆన్‌ ఆడి మ్యాచ్‌లు గెలిచాయి. ఇప్పుడు న్యూజిలాండ్‌ కూడా ఈ జాబితాలో చేరింది. దాదాపు 146 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగోసారి మాత్రమే.