Oct 16,2023 13:01

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ కు నీలం మధు ముదిరాజ్‌ రాజీనామా చేశారు. పటాన్‌చెరులో పదేళ్లుగా పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ.. బిఆర్‌ఎస్‌ లో ముదిరాజ్‌లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చిట్కుల్‌ సర్పంచిగా ఉన్న నీలం మధు.. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి బిఆర్‌ఎస్‌ నుండి టికెట్‌ ఆశించిన విషయం విదితమే. ఇటీవల సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు నియోజకవర్గం చిట్కుల్‌ గ్రామంలో నీలం మధు ముదిరాజ్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్‌ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, ఇష్టం మేరకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు నీలం మధు. దుర్గాదేవి పండుగ సందర్భంగా ఈ నెల 16న తేదీ నుంచి మీ బిడ్డనై ఇంటింటికీ వస్తున్నా అని వెల్లడించారు. 16 తేదీన కొత్తపల్లిలో బిఆర్‌ఎస్‌ కు రాజీనామా చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా.. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఆ కండువా కప్పుకుని బరిలో దిగుతా అని మధు ముదిరాజ్‌ స్పష్టం చేశారు.