Oct 14,2023 11:01

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం వేటువేసిన ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలలోగా బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
            ఇసికి అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్లతో పాటు పలు జిల్లాల ఎస్‌పిలను, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లపై ఇసి వేటు వేసింది. వారి స్థానంలో కొత్తవారి నియామకానికి ఒక్కో పోస్టుకు మూడు పేర్లతో సిఎస్‌ పంపిన జాబితాను పరిశీలించిన సిఇసి శుక్రవారం ఫైనల్‌ చేసింది. ఆ మేరకు సిఎస్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌గా భారతి హోలికేరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా గౌతమ్‌ పోట్రు, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా జెందగె హునుమంత్‌ కొండిబ, నిర్మల్‌ కలెక్టర్‌గా ఆశిష్‌ సంగ్వాన్‌ నియమితులయ్యారు.
         రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎ వాణి ప్రసాద్‌, వాణిజ్యపన్నుల శాఖ స్పెషల్‌ సిఎస్‌గా సునీల్‌ శర్మ, ఆబ్కారీ శాఖ కమిషనర్‌గా డా జ్యోతి బుద్దప్రసాద్‌, వాణిజ్య పన్నుల కమిషనర్‌గా డా క్రిస్టినా చొంగ్తులను బదిలీచేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సందీప్‌ శాండిల్యా, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా అంబర్‌ కిషోర్‌ ఝా, నిజామాబాద్‌ ఎస్‌పిగా కమలేశ్వర్‌ సింగెన్వార్‌, సంగారెడ్డి ఎస్‌పిగా రూపేశ్‌, కామారెడ్డి ఎస్‌పిగా సింధు శర్మ, జగిత్యాల ఎస్‌పిగా సన్‌ప్రీత్‌ సింగ్‌, మహబూబ్‌నగర్‌ ఎస్‌పిగా హర్షవర్ధన్‌, నాగర్‌ కర్నూల్‌ ఎస్‌పిగా గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, జోగులాంబ గద్వాల ఎస్‌పిగా రితిరాజ్‌, మహబూబాబాద్‌ ఎస్‌పిగా డా. పాటిల్‌ సంగ్రామ్‌ సింగ్‌, నారాయణపేట్‌ ఎస్‌పిగా యోగేశ్‌ గౌతమ్‌, జయశంకర్‌ భూపాలపల్లి ఎస్‌పిగా ఖరే కిరణ్‌ ప్రభాకర్‌, సూర్యాపేట ఎస్‌పిగా బికె రాహుల్‌ హెగ్డేలు నియమితులయ్యారు.