హైదరాబాద్ : 'నా సీటు పోతేపోనివ్వండి.. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నా' అని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మాదాపూర్లో ఇంటర్నేషనల్ టెక్పార్క్ను ప్రారంభించిన అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ ... మహిళానేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందన్నారు. '' రిజర్వేషన్లో భాగంగా నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను '' అని కెటిఆర్ అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లైఫ్సైన్సెస్ హబ్గా మారుతుందని మంత్రి కెటిఆర్ చెప్పారు.










