Apr 02,2023 06:43

మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలపై దేశ వ్యాపితంగా అనేక రూపాలలో ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం ఉధృతమవుతున్న సమయంలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మే 10న ఒకే విడతగా ఎన్నికలు పూర్తవుతాయన్న ప్రకటనే ఒక విధంగా ఆశ్చర్యం కలిగించింది. మోడీ మూలపీఠమైన గుజరాత్‌ వంటి చిన్న రాష్ట్రంలోనే ఏడు దఫాలుగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొంత వింతగానే అనిపిస్తుంది. అదలా వుంచితే అదానీ బాగోతంతో మోడీ ఇరకాటంలో చిక్కుకోవడం, రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు దేశవ్యాపిత నిరసన, కార్పొరేట్‌ అనుకూల విధానాలపై ఉద్యమాలు, సంఘ పరివార్‌ మతతత్వ రాజకీయాలపై ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వస్తున్నాయి. దక్షిణాదిన కాలూనడం కష్టమైన బిజెపికి కర్ణాటక ఒక్కటే దింపుడు కళ్లెం ఆశ కాగా ఇప్పుడు అదీ ఎదురీతగా మారింది. కులాల కుంపట్లకు మారుపేరైన కర్ణాటకలో దాంతోపాటు మతతత్వ మంటలు రాజేసిన ఘనత బిజెపిదే. గత ముప్పై ఏళ్లలో ఒకసారి కూడా...అధికారంలోని సర్కారు మళ్లీ గెలవకపోవడం కర్ణాటక ప్రత్యేకత. దేవెగౌడ, కుమారస్వామి, జెడిఎస్‌ అవకాశవాద రాజకీయాల ఫలితంగా మొదటిసారి రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందిన బిజెపి తరపున యెడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే లింగాయత్‌లను సమీకరించి, అవినీతి గని సామ్రాట్‌ గాలి జనార్ధనరెడ్డి వత్తాసుతో స్వంతంగా మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయితే కుంభకోణాల పరంపరలో వరుసగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోవలసి వచ్చింది. ఒక దశలో యెడ్యూరప్ప కూడా తిరుగుబాటు చేసి స్వంత పార్టీ పెట్టుకున్నారు. కాని మళ్లీ 2018 ఎన్నికల నాటికి అన్యథా శరణం నాస్తి అంటూ ఆయననే మళ్లీ చేర్చుకోవడం బిజెపి దురవస్థకు అద్దం పడుతుంది. గత ఎన్నికల్లో పెద్ద పార్టీగా బిజెపి వచ్చినా ఎవరికీ మెజార్టీ దక్కలేదు. మెజార్టీ లేకున్నా యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలపరీక్ష రణరంగంగా మారడంతో తోక ముడవడం తెలిసినవే. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దాన్ని బతకనివ్వలేదు. ఫిరాయింపుల ఆసరాతో మళ్లీ బిజెపి గద్దెక్కడం, బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రి కావడం తెలిసిన విషయాలే.

  • అవినీతి, మతతత్వ ప్రజ్వలన

బొమ్మై పాలనతో కర్ణాటక పరిస్థితి దారుణంగా పరిణమించింది. ఉత్తరాది తరహా మతోన్మాద రాజకీయాలను రాజేసింది. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరించి రాకూడదనే ఆంక్షలు దేశంలోనే చిచ్చు పెట్టాయి. విద్యార్థులు ఏ మతానికి చెందిన వారైనా యూనిఫాం ఒకటే ధరించాలి గాని బురఖా వేసుకోకూడదనే కొత్త షరతు విమర్శల పాలైంది. దీనిపై రాజ్యాంగ రీత్యా తమకు గల హక్కులను గురించి ముస్లిం సంస్థలు చేసిన పోరాటం, వాదోపవాదాల మధ్య విద్యా సంవత్సరమే దెబ్బతినిపోయింది. కర్ణాటక హైకోర్టు కూడా ఇందుకు మద్దతు తెల్పడంతో కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అక్కడ కూడా కొందరు న్యాయమూర్తులు మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అది అపరిష్కృతంగానే వుంది. టిప్పు సుల్తాన్‌ జయంతి, విగ్రహ స్థాపన వంటి విషయాలపై సంఘ పరివార్‌ సృష్టించిన వివాదం మరో రభసకు దారితీసింది. దీనికి పరాకాష్టగా, ఎన్నికల తేదీ ప్రకటనకు కొద్దిగా ముందే హోం మంత్రి అమిత్‌ షా కర్ణాటకలో ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్‌ ఎత్తివేస్తామని ప్రకటించారు. తమ హిందూత్వ రాజకీయాలకు దక్షిణ భారత దేశంలో కర్ణాటకను కేంద్రంగా చేసుకోవాలన్నదే ఇక్కడ దుర్నీతి. వీటన్నిటి ఫలితంగా రాష్ట్రంలో ఇస్లామిక్‌ తీవ్రవాద శక్తులు కూడా కొంత పట్టు సంపాదించడంతో బిజెపి మరింత వ్యతిరేతను రెచ్చగొట్టే అవకాశం కలిగింది. మతాంతర వివాహాలు, మత మార్పిళ్లు, చరిత్ర పాఠాల మార్పు వంటి నిర్ణయాలన్నీ ఇందుకే కారణమైనాయి. లింగాయత్‌లలో పట్టు పెంచింది యెడ్యూరప్ప అయినా ఆ సమీకరణాలలో కొత్త ఫార్ములాలు తీసుకురావాలన్న కోణంలోనే ఆయనను తప్పించి బొమ్మైని తీసుకొచ్చారు. ముస్లింలకు రద్దు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లలో వొక్కలింగ లింగాయత్‌ రిజర్వేషన్‌ రెండు శాతం చొప్పున కోటా ఇవ్వడం ఇందులో భాగమే. దీనివల్ల ఆ తరగతులు కూడా సంతృప్తి చెందింది లేదు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నిరసనలు కూడా జరిగాయి. అధిష్టానం తనను దూరం పెట్టడం జీర్ణించుకోలేని యెడ్యూరప్ప అసంతృప్తి శిబిరం నడిపించారు. ఆఖరుకు ప్రధాని మోడీ స్వయంగా వచ్చి ఆయనను బహిరంగ వేదికపై పొగిడి బుజ్జగించాల్సి వచ్చింది. అవినీతి ఏ స్థాయికి చేరిందంటే కాంట్రాక్టర్ల సంఘం తాము 40 శాతం కమీషన్లు భరించలేక బహిరంగ ప్రకటన చేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే 93 కోట్లు అక్రమ ధనం పట్టుపడటం దీనికో ఉదాహరణ. ఇదేగాక గిడ్డంగులలో గుట్టలు పేర్చిన మద్యం, ఖరీదైన కానుకలు భారీ ఎత్తున పట్టుపడ్డాయి. ఇవి బిజెపి జాతీయ కార్యదర్శిగా వున్న ఎంఎల్‌ఎ సి.టి.రవికి సంబంధించినవిగా తేలింది. కర్ణాటక సోప్స్‌ అండ్‌ డిటర్జంట్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా వున్న మదల్‌ విరూపాక్షను లోకాయుక్త అభిశంసించగా ముందస్తు బెయిల్‌ కూడా రద్దయి అరెస్టయ్యారు. అనేక అక్రమ లావాదేవీలలో అనుమానితుడుగా వున్న మరో దళారీ అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు.

  • కాంగ్రెస్‌ ఆశలు, సవాళ్లు

బొమ్మై సర్కారు పట్ల ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగానే వుందని పరిశీలకులు అంచనా వేస్తుంటే అదే తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌కు ఎస్‌సి, ఎస్‌టిలు, వక్కలిగలు ప్రధాన మద్దతుదారులుగా వున్నారు. సిద్దరామయ్యతో సహా బలమైన గుర్తింపు గల నాయకులు కూడా కాంగ్రెస్‌లో వున్నారు. మధ్యలో జెడిఎస్‌ కూడా పరిమిత ప్రాంతాలలో వక్కలిగలలో పట్టు కలిగివున్నా ఆ ప్రభావం తగ్గుముఖంలో వుంది. పలుసార్లు రాజకీయ పొత్తులు మార్చిన ఆ పార్టీకి విశ్వసనీయతా లోపం కూడా వుంది. దక్షిణ భారతంలో కాంగ్రెస్‌ ప్రధాన శక్తిగా వున్న ఒకే ఒక రాష్ట్రం ఇదొక్కటే. ఆ విధంగా కర్ణాటక ఎన్నికల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బిజెపి ముఖాముఖి తలపడే చోట్ల పరిస్థితికి సంకేతాలుగా నిలుస్తాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా వున్న దళిత నేత మల్లికార్జున ఖర్గే స్వంత రాష్ట్రం గనక ఇవి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఒక పరీక్షగా వుంటాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దేశంలో మూడే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న కాంగ్రెస్‌కు ఇది చాలా కీలకమైన పరీక్ష. అంతర్గత విభేదాలు కూడా ఎక్కువే అయినా ఏకాభిప్రాయం వున్న 124 చోట్ల అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌ ముందుగా రంగంలో నిలిచింది.

  • 20 చోట్ల తెలుగు ముద్ర

కర్ణాటకకూ తెలుగువారికి సంబంధాలు చారిత్రికమైనవి. తెలుగు వారి సంఘాలు, తెలుగు నాట గల పార్టీలపట్ల అనుకూల ప్రతికూలతలు అక్కడ సర్వసాధారణం. మొత్తం కోటి మంది వరకూ తెలుగువారు అక్కడ వున్నారని, బెంగళూరులోనే పాతిక లక్షల వరకూ వుంటారని తెలుగు సంఘాలు చెబుతుంటాయి. మైసూర్‌ కర్ణాటక, హైదరాబాద్‌ కర్ణాటక, బెంగళూరు కర్ణాటక అని మూడు భాగాలుగా పిలుస్తుంటారు. జెడిఎస్‌ నాయకుడు కుమారస్వామి కెసిఆర్‌తో కలవడమే గాక బిఆర్‌ఎస్‌ ప్రారంభ సభకూ హాజరైనారు. అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందని కూడా కథనాలు వచ్చాయి కాని తర్వాత లేదని వివరణ ఇచ్చారు. జెడిఎస్‌ వంటిరిగా పోటీ చేస్తే పొత్తు పెట్టుకోవడమో బలపర్చడమో చేయొచ్చని బిఆర్‌ఎస్‌ నాయకులు వెల్లడించారు. తాము స్థానిక ఎన్నికలలో మాత్రం పోటీ చేస్తామన్నారు. 20 నియోజక వర్గాలలో తెలుగువారే నిర్ణాయక శక్తిగా వుంటారని చెబతున్నారు. ఇందులో ఒకటైన బాగేపల్లి గతంలో సిపిఎం గెలుచుకున్నది. ఇప్పుడు కూడా అక్కడ సన్నాహాల కోసం బి.వి.రాఘవులు, ఎం.ఎ.బేబీ పర్యటించారు. ఎ.పి బయట తాము జోక్యం చేసుకోమని వైసిపి చెబుతున్నా టిడిపి పరోక్షంగానైనా ఏదైనా చేయొచ్చనే అభిప్రాయం వుంది. అక్కడ తమ పార్టీని గెలిపించేందుకు సహకరించాలని ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ను హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల కోరారనే కథనాలు వున్నాయి. మజ్లిస్‌ కూడా రంగంలో వుంటుంది. ఆప్‌ కూడా దాదాపు అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించడంతో ఓట్ల చీలిక ఇంకా పెరుగుతుందనే అంచనాలు వున్నాయి.

  • పర్యటనల జోరు

ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నాయకత్వ లోపం కారణంగా ఈ సారి తాము గెలిచే అవకాశం లేదని బిజెపి నేతలు చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆరెస్సెస్‌ నేతల అంచనా కూడా అలాగే వుంది. అందుకే రాష్ట్రంలో మోడీ, అమిత్‌ షా వంటి వారు విస్తారంగా పర్యటించి గట్టెక్కించాలని తంటాలు పడుతున్నారు. మోడీనే తమ ఎన్నికల ముఖచిత్రంగా వుంటారని బిజెపి నేతలు చెప్పడానికి కారణమదే. కాంగ్రెస్‌ జాతీయ నేతలు కూడా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. తనపై పరువునష్టం కేసుకు శిక్ష అనర్హతలకు కారణమైన కోలార్‌ నియోజకవర్గం నుంచే రాహుల్‌ గాంధీ పర్యటన ప్రారంభిస్తున్నారని సమాచారం. సోనియా గాంధీ కూడా బాధ్యతల విరమణ యోచన తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెబుతున్నారు. 1977-78లో ఇందిరాగాంధీకి కర్ణాటక అండగా నిలిచినట్టే ఇప్పుడూ తోడు కావచ్చనే ఆశ లేకపోలేదు. 2018లో బిజెపికి 104 సీట్లు 36.35 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 78 సీట్లు 38.14 శాతం ఓట్లు వస్తే, జెడిఎస్‌కు 37 సీట్లు 18.3 శాతం ఓట్లు రావడం అక్కడ తీవ్ర విభజనను తెల్పుతుంది. జెడిఎస్‌ ప్రభావాన్ని మరింత తగ్గించి ఆ స్థానంలో తాను ప్రవేశించాలనేది బిజెపి వ్యూహంలో ఒక ముఖ్యాంశం. ఈ ఫలితాల ప్రభావం వెంటనే జరిగే తెలంగాణ ఎన్నికలపైనా 2024 లోక్‌సభ సమరంపైనా ప్రభావం చూపించడం ఖాయం. కనుకనే కర్ణాటకలో బిజెపిని అధికారానికి దూరం చేయడం ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యంగా వుంది. ఇందులో ఎవరి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఓటర్లే తేల్చి చెబుతారు.

ravi

 

 

 

 

 

 

తెలకపల్లి రవి