హైదరాబాద్: స్కిల్ డెవల్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దఎత్తున మద్ధతు లభిస్తోంది. అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాలని పార్టీ తీసుకున్న నిర్ణయానికి నందమూరి సుహాసిని మద్ధతు ప్రకటించారు. నారా చంద్రబాబు, నారా భువనేశ్వరీలకు సంఘీభావంగా అక్టోబర్ 2న హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. 'వీ ఆర్ విత్ సీబీఎన్' నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు అనుచరులు, ఐటీ ఉద్యోగులు, మద్ధతుదారులు పాల్గనాలని ఆమె ఆహ్వానించారు. రాజకీయ కుట్రలో చంద్రబాబుని బాధితుడిగా మార్చారని నందమూరి సుహాసిని మండిపడ్డారు. 23 రోజులుగా చట్టవిరుద్ధంగా నిర్భంధించారని, ఈ కష్టకాలంలో అంతా చేతులు కలిసి సంఘీభావం తెలియజేద్దామని ఆమె కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.










